YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లాంచీ ప్రమాదంలో 22మంది మృతి మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం మధ్యాహ్నం నుంచీ ఘటనా స్థలంలోనే సీఎం చంద్ర బాబు

లాంచీ ప్రమాదంలో 22మంది మృతి     మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం       మధ్యాహ్నం నుంచీ ఘటనా స్థలంలోనే సీఎం చంద్ర బాబు

గోదావరిలో లాంచీ మునక పెను విషాదం నింపింది. ఘటనా స్థలంలో పరిస్థితి హృదయవిదారకంగా మారింది.  ఈ దుర్ఘటనలో 22 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 12 మంది మృతదేహాలను వెలికి తీయగా .. మరో 10 మృతదేహాల కోసం నేవీ సిబ్బంది గాలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ప్రమాదం జరగ్గా.. పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. లాంచీ నదిలో 45 అడుగుల లోతుకు వెళ్లిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది. ఉదయం ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది నదిలో గాలించి లాంచీని గుర్తించారు. అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. లాంచీ తలుపులు తెరచుకోలేదు. ఫలితంగా తాళ్లు కట్టి ఇతర బోట్లు, క్రేన్ల సాయంతో బోటును బయటకు లాగారు.ఘటనా స్థలానికి స్వయంగా వెళ్లిన సీఎం చంద్రబాబు మృతదేహాల వెలికితీతను పర్యవేక్షించారు. లాంచీలో ఉన్న తమవారి ఆచూకీ కోసం నిన్నటి నుంచి ఎదురుచూసిన స్థానికులు మృతదేహాలను చూసి బోరున విలపిస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాలను పోస్టుమార్టం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.అక్కడే పోస్టుమార్టం చేసి స్వస్థలాలకు తరలిస్తున్నారు.  మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది మొత్తం 126 మంది సహాయక చర్యలు చేపట్టారని ముఖ్యమంత్రి వెల్లడించారు. నిన్న రాత్రి సమయంలో చీకటి నెలకొనడంతో ఏమీ చేయలేకపోయారన్నారు. ఈ ఉదయం నుంచి ఆపరేషన్‌ ఉద్ధృతం చేసి చేసి అన్నివిధాలా ప్రయత్నం చేసి ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికి తీసినట్టు చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఆ బాధిత కుటుంబ సభ్యుల్ని చూస్తుంటే బాధేస్తోందని సీఎం అన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. బోటు నిర్వాహకుల తప్పిదం వల్లే ఈ ఘోరం చోటుచేసుకుందని సీఎం అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.

Related Posts