అధికార టీఆర్ఎస్లో రెండు టికెట్ల లొల్లి రోజురోజుకూ ముదురుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పరిస్థితి చేయిదాటేలా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు తమ మనసులోని మాటను బహిరంగంగా చెబుతూ వివాదాలకు తెరలేపోతున్నారు. ఈ పరిస్థితి ఉమ్మడివరంగల్ జిల్లాలో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. తమతోపాటు మరొకరికి టికెట్ కావాలని ఆశిస్తున్న నేతల సంఖ్య పెరుగుతోంది. పార్టీ అధిష్టానం ఒప్పుకోని పక్షంలో తమదారి తాము చేసుకుంటామని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ భూపాలపల్లి నుంచి తమ కూతురును బరిలోకి దింపుతామని ప్రకటించడంతో మరోసారి ఈ రెండుటికెట్ల లొల్లి తెరమీదకు వచ్చింది.రెండు టికెట్ల కోసం కొట్లాడుతున్న నేతల్లో నలుగురు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కడియం రాజకీయ ప్రస్థానమంతా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం కేంద్రంగానే కొనసాగింది. స్టేషన్ఘన్పూర్లో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఎసరుపెట్టేందుకు కడియం ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన స్టేషన్ఘన్పూర్ నుంచి తన కూతురు కావ్యను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని కడియం శ్రీహరి చూస్తున్నారు. దీంతో పార్టీలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొండా సురేఖ ఉన్నారు. ఆమె భర్త కొండా మురళీధర్రావు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వీరి కూతురు కొండా సుస్మితాపటేల్ను వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి బరిలో దింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సుస్మితాపటేల్ భూపాలపల్లి నుంచి పోటీ చేస్తారని కొండా సురేఖ ఇటీవల బహిరంగంగానే ప్రకటించి, సిట్టింగ్ ఎమ్మెల్యే స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిపై తీవ్ర విమర్శలు చేయడం పార్టీలో కలకం రేపుతోంది. ఇదిలా ఉండగా… వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని సిరికొండ ధీమాగా ఉన్నారు. ఇక టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన గండ్ర సత్యనారాయణరావు టికెట్ ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్పై హామీతోనే తాను టీఆర్ఎస్లో చేరానని గండ్ర సత్యనారాయణరావు చెబుతుండడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో భూపాలపల్లిలో పార్టీ మూడువర్గాలు విడిపోయింది.పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రదీప్రావు 2009 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యవహార శైలితో చివరి నిమిషంలో వరంగల్ తూర్పు టికెట్ తనకే వస్తుందని ప్రదీప్రావు ధీమాగా ఉన్నారు. అంతేగాకుండా సీఎం కేసీఆర్ వద్ద ఎమ్మెల్యే ఎర్రబెల్లి మంచి పలుకుబడి ఉండడం కలిసొచ్చే అంశం. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి డోర్నకల్ ఎమ్మెల్యేగా డీఎస్.రెడ్యానాయక్ గెలిచారు. ఇక మానుకోట నుంచి ఆయన కూతురు మాలోతు కవిత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి, టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్నాయక్ చేతిలో ఓడిపోయారు. అనంతరం వీరిద్దరూ టీఆర్ఎస్లో చేరారు. అయితే సిట్టింగులకు సీటు గ్యారంటీ అంటూ సీఎం కేసీఆర్ ఇటీవల ఇచ్చిన హామీ ప్రకారం రెడ్యానాయక్కు డోర్నకల్ సీటుకు ఢోకా లేదనే టాక్ వినిపిస్తోంది. కాగా, వచ్చే ఎన్నికల్లో మానుకోట టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే కవిత ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా తక్కళ్లపల్లి రవీందర్రావుతో కలిపి పార్టీలో మూడువర్గాలు విడిపోయింది.