YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

తప్పుదోవ పట్టించే, రెచ్చగొట్టే వార్తలు ప్రసారం చేయెద్దు… టీవీ ఛానెల్స్‌కు కేంద్రం చురక

తప్పుదోవ పట్టించే, రెచ్చగొట్టే వార్తలు ప్రసారం చేయెద్దు…   టీవీ ఛానెల్స్‌కు కేంద్రం చురక

న్యూఢిల్లీ ఏప్రిల్ 23
ప్రైవేట్‌ టీవీ ఛానెల్స్‌ ధోరణిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జహంగిర్‌పూర్‌ ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా జరిగిన ఘర్షణలు, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి కొన్ని టీవీ ఛానెల్స్‌ ప్రసారాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, రెచ్చగొట్టేలా హెడ్‌లైన్లు, వ్యాఖ్యలు చేసిన కొన్ని టీవీ ఛానెల్స్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చురకలు వేసింది. నియమ, నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్న అలాంటి మానుకోవాలని హితవు పలికింది. ‘ఇటీవలి కాలంలో అనేక శాటిలైట్ టీవీ ఛానెల్స్‌ వార్తా సంఘటనలను అశాస్త్రీయంగా, తప్పుదారి పట్టించేవిగా, సంచలనాత్మకంగా కవరేజీని ప్రసారం చేసినట్లుగా గుర్తించాం. సామాజికంగా ఆమోదయోగ్యం కాని భాష, వ్యాఖ్యలను ఉపయోగించడం, ఇతరుల మర్యాదను కించపరచడం, అసభ్యకరంగా, పరువు నష్టం కలిగించేలా, మతపరమైన వ్యక్తీకరణలు వంటివి ప్రోగ్రామ్ కోడ్‌తోపాటు ది కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (నియంత్రణ) చట్టం 1995 సెక్షన్ 20లోని సబ్ సెక్షన్ (2) నిబంధనలను ఉల్లంఘించినట్లుగా కనిపిస్తున్నాయి’ అని పేర్కొంది.హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఇటీవల జరిగిన మత ఘర్షణలపై టీవీ ఛానెళ్ల కవరేజీని కేంద్రం ఈ మేరకు ఉదాహరించింది. ప్రజలను రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్న హెడ్‌లైన్స్‌, వ్యాఖ్యలు, హింసాత్మక వీడియోలు, సామాజికంగా ఆమోదయోగ్యం కాని భాష, మతపరమైన వ్యాఖ్యలు, సంబంధిత అంశాలపై టీవీ ఛానెల్స్‌లో చర్చలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటివి వీక్షకులపై ప్రతికూల మానసిక ప్రభావాన్ని చూపుతాయని, మత సామరస్యాన్ని ప్రేరేపిస్తాయని, శాంతికి విఘాతం కలిగిస్తాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.మరోవైపు టీవీ ఛానెల్స్‌లో ప్రసారమైన ఉక్రెయిన్‌ యుద్ధం కవరేజీపైనా కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేసింది. ‘కొన్ని ఛానెల్స్ తప్పుడు వాదనలు చేస్తున్నాయి. అంతర్జాతీయ ఏజెన్సీలు, నటులను తప్పుగా ఉటంకించడం గమనించాం. వార్తాంశాలతో పూర్తిగా సంబంధం లేని ‘స్కాండలస్ హెడ్‌లైన్‌లు, ట్యాగ్‌లైన్‌లను’ ఉపయోగిస్తున్నాయి’ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. చాలా మంది జర్నలిస్టులు, టీవీ యాంకర్లు వీక్షకులను రెచ్చగొట్టేలా కల్పితంగా, అతిశయోక్తితో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. సంబంధిత నియమ, నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్న వీటిని మానుకోవాలని,  జాగ్రత్త వహించాలని ఒక ప్రకటనలో గట్టిగా సూచించింది.

Related Posts