కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ తమకు ఉందని, అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో తమ బలాన్ని నిరూపించుకుంటామని కేంద్ర మంత్రి అనంతకుమార్ తెలిపారు. రాష్ట్ర 23వ ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభా పక్ష నేత బీఎస్ యడ్యూరప్ప గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమయానికి హజరయని అనంతకుమార్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ నిర్ణయం సమర్థనీయమనీ, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేయదల్చుకుంటే రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, సిద్ధరామయ్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలన్నారు. ఈ ముగ్గురూ కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారని తెలిపారు.
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదేళ్ల పాటు సుస్థిర పాలన అందిస్తానని అన్నారు. కర్ణాటక ప్రజల ఆశీర్వాదంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేశానన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ అనైతిక పొత్తుతో అధికారం కైవసం చేసుకోవాలని చూశాయని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత కాంగ్రెస్ - జేడీఎస్ లు పొత్తును పెట్టుకోవడం అనైతికమని, వారు అధికారకాంక్షతోనే ఈ పని చేశారని ఆరోపించారు.ఈ అనైతిక పొత్తులకు పాల్పడినా ప్రజలు నాకు, మా పార్టీకి మద్దతుగా నిలిచారన్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గుతామని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సాధ్యమైనంత త్వరలోనే అసెంబ్లీ వేదికగా తన బలాన్ని నిరూపించుకుంటానని, అందులో ఎటువంటి సందేహమూ లేదని యడ్యూరప్ప తెలిపారు. ప్రజలు నాపై ఉంచిన విశ్వాసానికి 100 శాతం న్యాయం చేకూరుస్తానన్నారు. 6.5 కోట్ల కన్నడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు యడ్యూరప్ప. అయన రైతు రుణమాఫీపై తొలి సంతకం చేశారు. రూ.56 వేల కోట్ల రూపాయల రైతు రుణాల మాఫీపై సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో రైతుల రుణాలను మాఫీ చేస్తాననీ, ఆ ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని వాగ్దానం చేసారు. ప్రధాని మోడీ కానీ, అమిత్ షాగాని ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. కొందరు కేంద్రమంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్తోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. యడ్యూరప్ప ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బల నిరూపణ తరువాతే కేబినెట్ బెర్తులు ఖరారు చేసి.. అప్పుడు వారితో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు. యెడ్డీ ప్రమాణం అనంతరం బీజేపీ కార్యకర్తలు శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై.. మోడీ, మోడీ అంటూ నినాదాలు చేశారు