రంజాన్ పండుగను పురస్కరించుకొని గ్రేటర్ హైదరాబాద్లో రెండు లక్షల మందికి ఉచితంగా నూతన వస్త్రాలను పంపిణీ చేయనున్నట్టు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. రంజాన్ పండుగ ఏర్పాట్లపై నేడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో కార్పొరేటర్లు, మైనార్టీ సంక్షేమ శాఖ, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు ఎ.కె.ఖాన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసిమ్, రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ తెలంగా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం అన్ని మతాల పండుగలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని, దీనిలో భాగంగా రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేదలకు దుస్తుల పంపిణీతో పాటు విందుభోజనం ఏర్పాటుకు హైదరాబాద్ నగరంలో 400లకు పైగా మజీద్లకు లక్ష రూపాయల చొప్పున నగదు పంపిణీ కూడా చేపడుతున్నామని తెలిపారు. రంజాన్ మాసంలో ఏవిధమైన ఇబ్బందులులేకుండా ఉండేందుకుగాను శానిటేషన్, లైటింగ్ ఇతర మౌలిక సదుపాయల కల్పనలో ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. రూ. 2.50కోట్ల వ్యయంతో అదనపు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని, అన్ని మజీద్లు, ఈద్గాల వద్ద రోడ్ల మరమ్మతులు, శానిటేషన్కు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. జీహెచ్ఎంసీలోని కార్పొరేటర్లు, కో-ఆప్షన్ మెంబర్లకు ఒకొక్కరికి రెండు మజీద్లకు లక్ష రూపాయల చొప్పున 500 గిఫ్ట్ ప్యాక్లను అందించనున్నామని తెలిపారు. డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన తేదీన నిరుపేద ముస్లీం లబ్దిదారులకు గిఫ్ట్ ప్యాక్ల పంపిణీతో పాటు విందు భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. తమ పరిధిలోని మజీద్ల పేర్లు, బ్యాంకు అకౌంట్ల వివరాలు జీహెచ్ఎంసీలోని యు.సి.డి విభాగానికి అందజేయాలని ఫసియుద్దీన్ తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసానికి గత రెండు నెలల నుండే ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.