హైదరాబాద్ లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో 3:30 కే చీకటి కమ్మేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పొద్దున నుంచి ఎండ, మధ్యాహ్నం నుంచి వర్షంతో జనం ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పట్టపగలే చీకట్లు అలముకున్నాయి. చీకట్లు పడడంతో.. వాహనాలన్నీ లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. గాలుల తీవ్రతకు రోడ్లపై ఉన్న వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్సిటీ, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్ష తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పలు చోట్ల రోడ్లపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో కుండపోత వర్షం కురిసిట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండు మూడు రోజుల పాటు ఇలా తేలికపాటి నుంచి భారీ వర్షాలు తెలంగాణలో పడే అవకాశం ఉందంటున్నారు.