వాజపేయి హయాంలో బీజేపీ నీతివంతమైన రాజకీయాలు చేసిందని... కేవలం ఒక్క ఓటు తక్కువైన నేపథ్యంలో ప్రధాని పదవినే వాజపేయి వదిలేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. ఇప్పుడు మోదీ నాయకత్వంలో అధికారమే పరమావధిగా బీజేపీ సాగుతోందని... అధికారం కోసం ఎంతకైనా దిగజారుతోందని విమర్శించారు. బీజేపీపై నారాయణ మండిపడ్డారు. రాజకీయ విలువలకు బీజేపీ నేతలు పూర్తిగా తిలోదకాలిచ్చేశారని విమర్శించారు. కర్ణాటకలో ఆ పార్టీ చేస్తున్న నీచమైన రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థనే పరిహసించేలా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం లేనప్పటికీ... గవర్నర్ ను అడ్డం పెట్టుకుని, దొడ్డిదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు.ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు. కేరళలో ఒక్క సీటు తక్కువ కావడంతో ప్రతిపక్షంలో కూర్చున్న గొప్ప చరిత్ర సీపీఐది అని చెప్పారు.