కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చెబుతున్నా ప్రజా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. హైదరాబాద్ లో చినుకు పడితే చాలు రోడ్లు జలమయమవుతాయని,ఎక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్తి నెలకొందన్నారు.కోట్ల రూపాయల జిఎచ్ఎంసి బర్జేట్ ఎక్కడకు వెళుతుందో అర్ధం కావడం లేదన్నారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలో 24న నిర్వహించే తెలంగాణ మహానాడు ఏర్పాట్లను తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డితో కలిసి గురువారం ఆయన పరిశీలించారు..ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోందని రమణ విమర్శించారు. ప్రాంతీయ పార్టీల మనుగడను ప్రశ్నార్థకం చేసే విధంగా భాజపా కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల్లో పూర్తి మోజార్టీ రాకున్నా అధికారం చేపట్టి రాజకీయ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిందని ఆక్షేపించారు. మహానాడులో గత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ రాజకీయాలపై చర్చిస్తామని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఈ మహానాడుకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్య అతిధిగా హాజరవుతారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టాలను నామమాత్రం చేసి అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుంటోందని ఆయన ఆరోపించారు.