ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కష్టాలు వెంటాడుతున్నాయి. అవన్నీ కూడా తనకుతానుగా ఏరికోరి తెచ్చుకున్న కష్టాలే కావడం గమనార్హం. కొద్దిరోజులుగా ఆయన ఏం మాట్లాడినా వివాదస్పదం అవుతోంది. కొద్దిరోజుల క్రితం ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యల మంటలు ఇంకా చల్లారడం లేదు. ప్రైవేట్ పాఠశాలలను ఉద్దేశించిన కడియం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు.. ఏకంగా తెలంగాణ వ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలు ప్రభావం చూపుతున్నాయి. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లోనూ ఆయనకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి.ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ… గ్రామాల్లోకి వచ్చిన ప్రైవేట్ పాఠశాలల బస్సుల గాలి తీసేయాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చిలికిచిలికి గాలివానలా మారుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. తాజాగా.. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బుధవారం నిరసన తెలిపాయి. కడియం శ్రీహరి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో తాము భాగస్వామ్యం అవుతున్నామనీ, రైతుబంధు కార్యక్రమానికి తాము బస్సులు పంపామని వారు చెప్పారు.ఇదిలా ఉండగా… వచ్చే ఎన్నికల్లో తనతోపాటు తన కూతురు కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న కడియం శ్రీహరికి ఈ పరిణామాలు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తాను వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి, కూతురు కావ్యను స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి బరిలో దించేందుకు కడియం శ్రీహరి పావులు కదుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. జనగామ మండలం వడ్లకొండలో నిర్వహించిన రైతుబంధు కార్యక్రమంలోనూ ఓ రైతు కడియం చుక్కలు చూపించారు. గోదావరి జలాలతో చెరువులన్నింటినీ నింపామని కడియం చెప్పగా.. వెంటనే ఓ రైతు లేచి.. తమ ఊరు నింపలేదని అనడంతో ఆయన కంగుతిన్నారు.