YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మా వెనుక 120 మంది ఉన్నారు

మా వెనుక 120 మంది ఉన్నారు

కన్నడ రాజకీయం శనివారం కీలక మలుపు తిరగనుంది. నేతృత్వంలోని బీజేపీ సర్కారు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. యడ్డీ సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో బల పరీక్షకు వెళ్లాల్సి వస్తోంది. తమకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది. బల పరీక్ష నిరూపణకు సిద్ధమని, శనివారం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామని యడ్యూరప్ప ప్రకటించారు. బలపరీక్ష నిర్వహణకు ముందే ఎమ్మెల్యేలంతా ప్రమాణం చేయాలి. తర్వాత స్పీకర్‌ను ఎన్నుకోవాలి. ఎమ్మెల్యేలుగా బాధ్యతల స్వీకరణకు ఎవరూ గైర్హాజరు కాకుండా చూడటం, స్పీకర్‌గా బీజేపీ అభ్యర్థిని ఓడించడం కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ముందున్న అసలు సవాల్. ముందుగా కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొని స్పీకర్‌గా తమ వాడిని ఎన్నికయ్యేలా చూడాలనేది బీజేపీ వ్యూహం. తర్వాత వారు బలనిరూపణ సమయంలో దూరంగా ఉంటే.. మరికొందరు విపక్ష సభ్యులను తమవైపు లాగేసుకొని బలపరీక్షలో నెగ్గాలని కమలం పార్టీ రెండు దశల్లో వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. లింగాయత్ వర్గానికి చెందిన విపక్ష ఎమ్మెల్యేలు తమకు మద్దతు పలుకుతారని యడ్యూరప్ప నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ రాలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ గాలితో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బంధువైన ఆనంద్ సింగ్ గతంలో బీజేపీ తరఫున మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీలో మొత్తం 225 సీట్లు ఉండగా, 222 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆర్‌ఆర్ నగర్, జయనగర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆంగ్లో-ఇండియన్ ఎమ్మెల్యేను గవర్నర్ నామినేట్ చేసినప్పటికీ... సుప్రీం దాన్ని రద్దు చేసింది. ప్రస్తుత బలాబలాల ప్రకారం 112 మంది ఎమ్మెల్యేలు యడ్యూరప్ప సర్కారుకు మద్దతు పలికితేనే ప్రభుత్వ నిలబడుతుంది. అలా జరగొద్దంటే.. విపక్షానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి లేదా ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉంటే బీజేపీ గట్టెక్కే అవకాశాలున్నాయి. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో తలెత్తిన పరిస్థితులు కర్ణాటక అసెంబ్లీలోనూ ఏర్పడి ఉద్రిక్తకర పరిస్తితులు ఏర్పడితే.. బీజేపీ దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేల కోసం బీజేపీ ప్రయత్నిస్తోంటే.. యడ్యూరప్ప పట్ల అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలకు హస్తం పార్టీ ఎర వేస్తుండటం కొసమెరుపు. అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి యడ్యూరప్పకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. రేపు సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలని స్పష్టమైన ఆదేశాలను వెలువరించింది. సుప్రీం తీర్పు పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేలా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని కాంగ్రెస్ నేత అశ్వని కుమార్ తెలిపారు న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సుప్రీంకోర్టు మరోసారి నిలబెట్టుకుందని చెప్పారు. అనైతిక విధానాలతో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి సుప్రీంకోర్టు నిర్ణయం చెంపపెట్టులాంటిదని అన్నారు. రేపు జరగబోయే బలపరీక్షలో యడ్యూరప్పకు, బీజేపీకి పరాభవం తప్పదని చెప్పారు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలు ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ కూటమి బలపరీక్షలో గెలుపొంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. 

Related Posts