మే నెల ప్రవేశంతో భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. పెరుగుతున్న ఎండలతో వాతావరణంలో మార్పు రావడంతోపాటు తేమ శాతం కూడా తగ్గుతున్నది. మధ్యాహ్నం తీవ్రమైన ఉక్కపోత, వేడి ఇబ్బందులకు గురి చేస్తుండగా సరిపడా నీటిని శరీరానికి అందించకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం కొంత మేర పెరగడంతో ఉష్ణోగ్రతల్లో ఎక్కువ వ్యత్యాసం లేకపోవడం కూడా తీవ్రతను కొంచెం తగ్గిస్తున్నా.. మార్పులను తట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఎక్కువ నీటిని తీసుకోవడంతోపాటు.. కొబ్బరి బొండాల వంటి చల్లని పదార్థాలు, పండ్లు సైతం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడే ఇంతలా ఎండలు ఉండడంతో రాబోయే రోజుల్లో రికార్డ్ లెవల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంతా భయపడుతున్నారు. అకాల వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నా.. పగటిపూట ఉష్ణోగ్రతల్లో మాత్రం మార్పు ఉండడంలేదు. దీంతో జనాలు ఇళ్లకే పరిమితవుతున్నారు.
వేసవిలో ఎండ తీవ్రత ఏటికేడాది క్రమంగా పెరుగుతోంది. కొన్ని దశబ్దాలుగా పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామీకరణతో కాలుష్యం అధికమవుతోందని, ఈ కారణంగానే ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల నమోదవుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. పలు ప్రాంతాల్లో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నానికి మరింతగా విజృంభించేస్తున్నాడనే చెప్పొచ్చు. దీంతో, చాలా మంది ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచే బయటకు రావడానికి భయపడుతున్నారు. నెత్తిపై గొడుగులు, ముఖానికి ముసుగులు వేసుకొని వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఎండల ప్రభావం ప్రారంభమై సాయంత్రం 6 దాటినా కొనసాగుతోంది. దీంతో ప్రజలు ఉష్ణతాపాన్ని జయించేందుకు నానాపాట్లు పడుతున్నారు.