రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమవుతుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు పథకం అమలు ఫై మంత్రిని కలిసిన ‘మా ప్రతినిధి’ తో మంత్రి మాట్లాడుతూ రెండో హరిత విప్లవానికి తెలంగాణ కేంద్ర బిందువు అవుతుందన్నారు. సాగునీరు, రైతుబంధు వల్ల గల్ఫ్కు వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని చెప్పారు. ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. పంటల బీమా విధానం మారాలి. కమతం యూనిట్గా జరగాలని తెలిపారు. పదేళ్లలో రైతుబంధుకు మించిన సంతృప్తి ఏ పథకం ఇవ్వలేదని చెప్పారు.98.3 శాతం రైతులు చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. 1.7 శాతం రైతులకు మాత్రమే 10 ఎకరాలకు పైగా భూమి ఉందన్నారు. 10ఎకరాలకు పైగా ఉన్నవారికి పంట పెట్టుబడి ఇవ్వకపోయి ఉంటే విపక్షాలు రాద్ధాంతం చేసేవి అని పేర్కొన్నారు. పథకం సానుకూలంగా అమలు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ ఉద్ఘాటించారు. భూపరిమితి చట్టం ప్రకారం ఎవరికీ 54ఎకరాలకు పైబడి ఉండరాదన్నారు. వందల ఎకరాలున్నాయని చిల్లర ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మంత్రి మండిపడ్డారు.
కౌలురైతులకు సాయం చేస్తే వారు భూమిపై హక్కులు కోరుతారని తెలిపారు. రైతుబంధు ప్రయోజనం కౌలురైతులకు కూడా పరోక్షంగా అందుతుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్పై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తుందన్నారు. త్వరలోనే ముసాయిదాను మంత్రివర్గానికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. హరిత విప్లవం, నీలి విప్లవం, మాంసం శుద్ధితో గులాబీ విప్లవం తీసుకువస్తామన్నారు. నవంబర్లో మరింత సాధికారికంగా రైతుబంధు సాయం అందుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.