రంజాన్ మాసంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు 8 వేల మందితో భారీ భద్రతను ఏర్పాటు చేసారు. నగరం మొత్తం డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు. పాతబస్తీతో పాటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రార్ధనలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక సోషల్ మీడియలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రార్థన సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోకస్ పెట్టారు. ప్రార్ధనా మందిరాల పరిసర ప్రాంతాలను సీసీ కెమెరాల నిఘా ఉంచారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల వీడియోలను గమనిస్తూ ప్రత్యేక సూచనలిచ్చేలా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎనిమిది వేల మంది పోలీసులను సెక్యూరిటీ కోసం సిద్ధం చేసారు. లోకల్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు,రాపిడ్ యాక్షన్ ఫోర్స్, మౌంటెడ్ పోలీసులు, ఆక్టోపస్ బలగాలను అందుబాటులో ఉంచారు. భద్రతపై భరోసా ఇస్తున్న పోలీసులు.. పాతబస్తీలో యువత తమకు సహకరించాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.