కర్ణాకటలోమరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఇప్పుడు ఈ రెండుస్థానాలు కూడా అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి అంత్యత కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తక్కువ మెజారిటీ ఉన్న నేపథ్యంలో ప్రతీ సీటు ఎంతో కీలకంగా మారింది. మరోవైపు ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జేడీఎస్, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదరడంతో రాజేశ్వరీనగర్లో జేడీఎస్కు కాంగ్రెస్, జయనగరలో కాంగ్రెస్కు జేడీఎస్ మద్దతు ఇచ్చే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది.కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను ఈనెల 12న 222 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బెంగళూరు నగరంలోని జయనగర, ఆర్ ఆర్ నగర స్థానాలకు ఎన్నికలను ఎన్నికల కమిషన్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయా నియోజకవర్గాలకు ఎన్నికల తేదీలను కమిషన్ ప్రకటించడంతో మరో ఉత్కంఠత నెలకొంది.జయనగర బీజేపీ శాసన సభ్యుడు బీఎన్. విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగానే గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో ఆ నియోజక వర్గం ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ స్థానానికి జూన్ 11న పోలింగ్, జూన్ 16న ఫలితాలు వెలువడనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే మే 18వ తేదీ నుంచి జయనగర శాసన సభ నియోజక వర్గంలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని కమిషన్ పేర్కొంది. జయనగర నుంచి కర్ణాటక మాజీ హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. అయితే జయనగరలో బీజేపీ మాత్రం ఇంత వరకు అధికారికంగా అభ్యర్థిని ప్రకటించలేదు. రాజరాజేశ్వరినగర (ఆర్ ఆర్ నగర) నియోజక వర్గంలోని ఓ అపార్ట్ మెంట్ లో 9,000 కు పైగా నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు బయటపడటంతో అక్కడ ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తోన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు అపార్ట్మెంట్లోనే ఈ గుర్తింపు కార్డులు దొరకడంతో ఎన్నికల సంఘం ఇక్కడ ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మే 28న ఆర్ ఆర్ నగరలో పోలింగ్, మే 31వ తేదీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇదిలా ఉండగా… జయనగరలో బీజేపీ టిక్కెట్ ను స్థానిక కార్పొరేటర్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ ఆచితూచి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా… జేడీఎస్ నేత కుమారస్వామి కూడా చెన్నపట్నంతోపాటు రామనగర నియోజకవర్గంలోనూ గెలిచారు. ఆయన ఏదో ఒకస్థానానికి రాజీనామా చేస్తే అక్కడ కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఆయన రాజీనామా చేసిన స్థానం నుంచి ఆయన సతీమణిని బరిలోకి దింపే అవకాశం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.