రైతుబంధు చెక్కులకు నగదు కొరత లేదు, అవసరమైనంత కరెన్సీ బ్యాంకులలో అందుబాటులో ఉంచామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. శనివారం బీర్కూర్ మండల కేంద్రంలోని ఆంధ్రా బ్యాంకును సందర్శించిన మంత్రి పొచారం రైతుబంధు నగదు కోసం వచ్చిన రైతులతో మాట్లాడారు. తొలకరి వర్షాలకు ఇంకా సమయం ఉన్నది, చెక్కులను మూడు నెలల లోపు ఎప్పుడైనా మార్చుకోని డబ్బులు తీసుకోవచ్చు. కరెన్సీ నిల్వలపై రైతులు గాబరా పడవద్దు. అవసరమైన మొత్తం కంటే ఎక్కువగానే బ్యాంకులకు అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. రైతులు తమకు వచ్చిన నగధును వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.
రైతుబంధు పథకంతో తమకు ముందస్తు పెట్టుబడికై దిగులు పోయిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అరవై, డెబ్బై ఏళ్ళ నుండి చూస్తున్నాం ఏనాడూ ఏ ప్రభుత్వం రైతులకు ఇలా నేరుగా నగదు సహాయం అందించలేదు, తెలంగాణ ప్రభుత్వంలోనే ఇది నిజమయిందని వృద్ద రైతులు మంత్రిగారితో ఆనందం వ్యక్తం చేశారు. తమ బాధలను తీర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి పొచారం కు ధన్యవాదాలు తెలిపారు. నగధును తీసుకోవడానికి రైతులు బారీగా వస్తుడటంతో అదనంగా కౌంటర్లను ఏర్పాటు చేశామని బ్యాంకు అధికారులు మంత్రి గారికి తెలియజేశారు.