కాంట్రాక్టర్లపై కేంద్రమంత్రి మండిపడ్డారు. అవినీతి చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మధ్యప్రదేశ్లోని బేతుల్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్తో కలిసి పాల్గొన్నారు. అయితే ఆయన ప్రభుత్వం కేటాయించిన నిధులు... కాంట్రాక్టర్లు చేపట్టిన పనులపై స్పందించారు. ఎవరైనా నిధుల్ని దుర్వినియోగం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు రోడ్లకు సంబంధించిన పనుల్ని సక్రమంగా జరుగుతున్నాయో లేదో పరిశీలించాలన్నారు కేంద్రమంత్రి.కాంట్రాకర్టులు నిధుల్ని సక్రమంగా వినియోగించకుండా... అవినీతికి పాల్పడితే బుల్డోజర్ కింద నలిగిపోయే రాళ్లు బదులు మీరుంటారని తీవ్రంగా హెచ్చరించారు నితిన్ గడ్కరీ. రోడ్ల కోసం ఖర్చు చేస్తున్న నిధులన్నీ దేశంలోని పేద ప్రజలదని... వాళ్లకు సంబంధించిన డబ్బు విషయంలో అవినీతి జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. కాంట్రాక్టర్లపై గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.