YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ముదురుతున్న మరాఠ వివాదం

ముదురుతున్న మరాఠ వివాదం

ముంబై, జూన్ 24,
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్‌ సర్కార్‌ మైనార్టీలో పడిపోయింది. అన్నిదారులూ మూసుకుపోవడంతో ఉద్ధవ్ గద్దె దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో శివసేన మరో కీలక నిర్ణయం తీసుకుంది.. 12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసింది. బుధవారం జరిగిన సమావేశానికి హాజరు కానందున 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసినట్లు శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి ముంబైలో మీడియాతో మాట్లాడారు.అనర్హత వేటుకు ప్రతిపాదించిన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో.. ఏకనాథ్ షిండే, ప్రకాష్ సర్వే, తానాజీ సావంత్, మహేశ్ షిండే, అబ్దుల్ సత్తార్, సందీప్ భూమారే, భరత్ గోగావాలే, సంజయ్ శిర్సత్, యామినీ యాదవ్, అనిల్ బాబర్, బాలాజీ దేవదాస్, లతా చౌదరి ఉన్నారు. కాగా.. అనర్హత వేటుకు సంబంధించి మరికొందరి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం..
పార్టీ నాయకుడిగా నియమించండి.. ఏక్‌నాథ్ షిండే లేఖ..
శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా తన నియామకాన్ని పునరుద్ఘాటించడంతోపాటు పార్టీ చీఫ్ విప్‌గా భరత్‌షేత్ గోగావాలేను నియమించడంపై రెబల్ శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో 37 మంది శివసేన ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి. ఈ లేఖను డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, శాసనమండలి కార్యదర్శి రాజేంద్ర భగవత్‌లకు పంపారు. శివసేన నుంచి ఒక్కొక్కరుగా షిండే రెబల్‌ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకోగా.. తాజాగా మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు శిబిరానికి వెళ్లారు. దీంతో ఏక్‌నాథ్‌ శిందేతో కలుపుకొని మొత్తం రెబల్‌ ఎమ్మెల్యేల సంఖ్య 39కి చేరింది.

Related Posts