తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎక్సలెన్సీ అవార్డు -2018 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు దక్కింది. నేడు రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ ఎక్సలెన్సీ అవార్డులను రాష్ట్రంలోని 13మంది అధికారులకు ప్రకటించగా వీరిలో జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి కూడా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపడుతున్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకుగాను అతితక్కువ సమయంలో విజయవంతంగా భూసేకరణ చేయడంలో సఫలీకృతమైనందుకుగాను జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డికి ప్రకటిస్తూ నేడు ప్రభుత్వం ఉత్తర్వుల జారీచేశారు. హైదరాబాద్ నగరాన్ని మురికి వాడల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా రూ. 8,598.58 కోట్ల వ్యయంతో లక్ష ఇళ్ల నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 109 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి 636.28 ఎకరాలను సేకరించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 7.90లక్షల వ్యయంతో రెండు బెడ్రూంలు, రెండు బాత్రూమ్లు, ఒక కిచెన్, హాల్తో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు మరెక్కడా సఫలీకృతం కానివిధంగా గ్రేటర్లో 41 బస్తీలలో నివాసితులను ఖాళీ చేయించి ఇన్సిటు పద్దతిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడంలో జీహెచ్ఎంసీ విజయం సాధించింది. ఇందుకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వ ఎక్సలెన్సీ అవార్డును కమిషనర్కు ప్రకటించారు. కాగా ఇటీవలే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డును కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్రెడ్డి స్వీకరించారు. దీంతో పాటు కేంద్రం పట్టణాభివృద్ది, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హడ్కో అవార్డు కూడా జీహెచ్ఎంసీకి లభించింది.