YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రంగంలో దిగిన కేంద్రం వరద బాధితులకు బాసట

రంగంలో దిగిన కేంద్రం వరద బాధితులకు బాసట

హైదరాబాద్, జూలై 21,
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. సామాన్య జనం సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారిన పరిస్థితులు ఉన్నాయి. వరదల్లో చిక్కుకుని బయట పడ్డ ఇండ్లన్నీ ఇప్పుడు బురద ముద్దలుగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు బాధితులకు సహాయ చర్యల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. వరదల్లో ప్రజలు అల్లాడుతుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోవడం లేదని బీజేపీ విమర్శలు గుప్పిస్తుంటే భారీ వరదలు వచ్చినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆదుకోవాలన్న సోయి కూడా లేదా? అని టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. అయితే మీ రాజకీయాలు ఎలా ఉన్నా// వాటిని పక్కన పెట్టి తమను ఆదుకోవాలని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ సర్కార్ కు బిగ్ షాక్ ఇస్తూ బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.వరదల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గతంలోనూ రాష్ట్రంలో వరదలు వచ్చిన సందర్భంలోనూ కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వలేదని చెబుతోంది. అయితే బీజేపీ నేతల ఆరోపణలు మరోలా ఉన్నాయి. వరద సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడంలో కేసీఆర్ సర్కార్ విఫలం అయిందని ఆరోపిస్తోంది. టీఆర్ఎస్ కు వరద నష్టాన్ని అంచనా వేసి నివేదికలు ఇవ్వడం చేతకాకపోవడంతోనే కేంద్రం నుండి నిధులు రాలేకపోతున్నాయని, ఇకనైనా నివేదికలు అందజేస్తే వరద సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని బీజేపీ చెబుతోంది. ఓ వైపు నుండి పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే.. బాధితుల నుండి నిరసనలు, ఆగ్రహ జ్వాలలు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన బీజేపీ చీఫ్ మంగళవారం నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో వరదల కారణంగా ఏర్పడిన నష్టాన్ని బాధితుల పరిస్థితులను వివరించారు. దీంతో అప్పటికప్పుడే అమిత్ షా నిర్ణయం తీసుకోవడం, కేసీఆర్ నివేదికలతో పని లేకుండా నేరుగా రాష్ట్రానికి హై పవర్ కమిటీని పంపేలా ఆదేశాలు ఇవ్వడంతో వరద సాయం వెనుక రాజకీయం ఆసక్తిగా మారింది.రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ తో కలిసి అమిత్ షాను కలిసిన బండి సంజయ్ రాష్ట్రంలోని వరద బాధితుల పరిస్థితులను వివరించారు. ఈ మీటింగ్ అనంతరం బండి సంజయ్ ట్వీట్ చేశారు. పొలాలు, ఇళ్లు, ప్రజలు, ఇతరులకు జరిగిన నష్టంపై అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారని, నష్టాన్ని అంచనా వేయడానికి ఓ కమిటీని తెలంగాణకు పంపేలా అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవడంపై ధన్యవాదాలు తెలిపారు. అయితే హైపవర్ కమిటీని పంపాలనే నిర్ణయం వెనుక అమిత్ షా భారీ వ్యూహం వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గద్దె దించాలని భావిస్తున్న బీజేపీ వరదల కారణంగా నష్టాన్ని అంచనా వేయడం చేతకాని సర్కార్ గా టీఆర్ఎస్ ను విమర్శలు చేస్తోంది. రాష్ట్రానికి ఎస్ డీఆర్ఎఫ్ నిధులను కేటాయించినప్పటికీ, మొదటి విడత నిధులను విడుదల చేయడానికి అవసరమైన విజ్ఞాపణ పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ అందించలేదని నిందిస్తోంది. విపత్తుల సమయంలో నివేదికలు పంపి రాష్ట్రానికి కావాల్సిన సాయం తెచ్చుకోవడానికి కేసీఆర్ కు ఎందుకంత పట్టింపు అనే కాన్సెంప్ట్ ను బిల్డ్ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ప్రజలను పట్టించుకోవాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇలా తన రాజకీయాల కోసం కేంద్రంతో వైరం పెచ్చుకుంటున్నారే తప్ప బాధితుల పక్షంగా నిలబడేది తామే అని బీజేపీ చెప్పే ప్రయత్నంలో భాగంగా అమిత్ షా హైపవర్ కమిటీని రాష్ట్రానికి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ సాగుతోంది. అయితే ఇప్పటికే వరద ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుండి హై పవర్ కమిటీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రాజకీయం మరింత ఆసక్తిగా మారింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి శౌరవ్‌ రే నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో వివిధ శాఖలకు చెందిన మరో అయిదుగురు అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం గురువారం తెలంగాణలో పర్యటించే అవకాశం కనిపిస్తోంది.

Related Posts