YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అప్ డేట్ కానీ 5 జీ టెక్నాలజీ

అప్ డేట్ కానీ 5 జీ టెక్నాలజీ

ముంబై, అక్టోబరు 13, 
దేశంలోని తొమ్మిది నగరాల్లో 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 1న ప్రారంభించినా, ఇప్పటికీ చాలా మొబైల్స్లో ఈ టెక్నాలజీ రావడం లేదు. 4జీ సిగ్నల్ మాత్రమే కనిపిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం యాపిల్, శామ్సంగ్తోపాటు ఇతర మొబైల్ ఫోన్ తయారీదారులు అన్ని రకాల 5జీ హ్యాండ్సెట్లకు త్వరగా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ను పంపాలని ఒత్తిడి తెస్తోంది. కంపెనీలు ఇటీవల లాంచ్ చేసిన  మొబైల్స్లో హై-స్పీడ్ 5జీ రావడం లేదనే ఫిర్యాదులు పెరిగిపోయాయి. ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఈ సేవలను నాలుగు నగరాల్లో, భారతి ఎయిర్‌‌టెల్ ఎనిమిది నగరాల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పాయి. వచ్చే ఏడాది సర్వీసును విస్తరింపజేస్తామని రెండు కంపెనీలు ప్రకటించాయి. దాదాపు ప్రతి ప్రాంతంలోనూ 5జీ ఉంటుందని జియో ప్రకటించింది. ఎయిర్‌‌టెల్ వెబ్‌‌సైట్ ప్రకారం, తాజా ఐఫోన్14తో సహా పలు ఐఫోన్ మోడల్‌‌లతో పాటు చాలా శామ్సంగ్ ప్రీమియం ఫోన్లలో  5జీని సపోర్ట్ చేసే సాఫ్ట్‌‌వేర్‌‌ లేదు. ఈ విషయమై చర్చించడానికి టెలికాం,  ఐటీ విభాగాలకు చెందిన టాప్ బ్యూరోక్రాట్‌‌లు బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. విదేశీ కంపెనీలు యాపిల్, శామ్సంగ్, వివో  షావోమీ, అలాగే దేశీయ టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్టెల్ వొడాఫోన్లకు చెందిన ఎగ్జిక్యూటివ్‌‌లు ఇందులో పాల్గొంటారు. 5జీకి ప్రాధాన్యం ఇవ్వడం, సాఫ్ట్‌‌వేర్ అప్‌‌గ్రేడ్‌‌లను విడుదల చేయడం వంటివి ఎజెండాలోని ముఖ్యమైన విషయాలని టెలికాం శాఖ వర్గాలు తెలిపాయి. ఈ విషయం గురించి మాట్లాడేందుకు కంపెనీలు అందుబాటులోకి రాలేదు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్‌‌ అయిన ఇండియాలో 5జీని ప్రారంభించడం వల్ల వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. వ్యవసాయం  ఆరోగ్యం వంటి రంగాలకు సంబంధించిన సేవలను ప్రజలకు మరింత వేగంగా అందించవచ్చు.5జీ సేవల కోసం ఈ ఏడాది ఆగస్టులో కేంద్రం ప్రభుత్వం మెగా వేలం నిర్వహించింది. దాదాపు 42 కోట్ల మందికి పైగా కస్టమర్లతో భారతదేశపు అతిపెద్ద మొబైల్ క్యారియర్ అయిన జియో 11 బిలియన్ డాలర్ల విలువైన (దాదాపు రూ. 90,600 కోట్లు) విలువైన 5జీ ఎయిర్‌‌వేవ్‌‌లను పొందింది. ఎయిర్‌‌టెల్ ఐదు బిలియన్ డాలర్లు కంటే ఎక్కువ ఖర్చు చేయగా (దాదాపు రూ. 41,000 కోట్లు), వొడాఫోన్  2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 16,500 కోట్లు) కంటే ఎక్కువ ఖర్చు చేసింది. వొడాఫోన్ ఐడియా ఇప్పటికీ 5జీ సేవలను ప్రారంభించలేదు. 5జీ టెక్నాలజీ గురించి టెలికాం,  స్మార్ట్‌‌ఫోన్ కంపెనీలు చర్చలు జరుపుతున్నప్పటికీ, భారతదేశంలోని టెలికాం కంపెనీల 5జీ టెక్నాలజీ,  ఫోన్ సాఫ్ట్‌‌వేర్ మధ్య ఇంటిగ్రేషన్ కోసం కొంత సమయం పడుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.  ఎయిర్‌‌టెల్ వెబ్‌‌సైట్ అన్ని  ఐఫోన్లకు "యాపిల్ ఇంకా 5జీ సాఫ్ట్‌‌వేర్‌‌ను అప్డేట్ చేయలేదు" అని చూపించింది. శామ్సంగ్లో చాలా మోడల్‌‌లు 5జీకి సిద్ధంగా లేవని ఎయిర్‌‌టెల్ పేర్కొంది.  చైనా స్మార్ట్ఫోన్ మేకర్లు  షావోమీ తోపాటు  వివోకు చెందిన  మూడు డజన్లకు పైగా మోడల్‌‌లు  5జీని సపోర్ట్ చేస్తాయని  తెలిపింది.  "5జీ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ కోసం యాపిల్ చాలా సమయం తీసుకుంటోంది. తమ ప్రీమియం క్లయింట్లు చాలా మంది యాపిల్ ఫోన్లు వాడుతున్నందున ఎయిర్‌‌టెల్ దీని గురించి ఆందోళన చెందుతోంది. సాఫ్ట్వేర్ సమస్యల గురించి రెండు కంపెనీలూ చర్చిస్తున్నాయి”అని ఈ సంగతి తెలిసిన వాళ్లు చెప్పారు.  మనదేశ  5జీ టెక్నాలజీలను యాపిల్ టెస్ట్ చేస్తోందని వివరించారు.

Related Posts