YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

16 నెలల్లో 500 కోట్లు లంచం

16 నెలల్లో 500 కోట్లు లంచం

రాయ్ పూర్, అక్టోబరు 15, 
ఆదర్శంగా నిలవాల్సిన ఓ ఐఏఎస్ ఆఫీసర్‌ డబ్బు సంపాదించాలనే వాంఛతో అడ్డదారులు తొక్కాడు. కేవలం 16 నెలల్లోనే దాదాపు రూ.500 కోట్లు వెనకేసుకున్నాడు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అడ్డంగా దొరికిపోవడంతో జైలు పాలయ్యాడు. ఈ మనీలాండరింగ్‌లో కేసులో సదరు ఐఏఎస్‌తోపాటు మరో ఇద్దరు ఐఏఎస్‌లను ఈడీ అరెస్టు చేసింది. వివరాల్లోకెళ్తే..
2009 బ్యాచ్ ఐఎఎస్ అధికారి సమీర్ విష్ణోయ్ ఛత్తీస్‌గఢ్‌ జియాలజీ అండ్ మైనింగ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు జారీ చేసిన నోటిఫికేషన్‌తో బొగ్గు రవాణా ద్వారా అక్రమంగా డబ్బు పోగవ్వడం ప్రారంభమైంది. బొగ్గు రవాణా కోసం ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గా అనుమతులు తీసుకోవాంటూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో గనుల నుంచి బొగ్గును తరలించేందుకు గనుల మంత్రిత్వశాఖ ఆఫీసు నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్‌ అనుమతులు తీసుకోవడం అనివార్యమైంది. ఇదే అదనుగా భావించిన సూర్యకాంత్‌ తివారీ అనే ఐఏఎస్‌ అధికారి ఎవరికి రవాణా అనుమతులు కావాలన్నా టన్నుకు రూ.25 చొప్పున వసూలు చేయడం ప్రారంభించాడు. ఇలా గడిచిన 16 నెలల్లో రూ.500 కోట్లకుపైగా కూడబెట్టినట్లు ఐటీ డాక్యుమెంట్లు చూపుతున్నాయి. ఈ మొత్తాన్ని రాజకీయ నాయకులు, ఇతర అధికారులకు పంపిణీ అయ్యినట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ విధంగా ఆర్జించగా వచ్చిన సొమ్ముతో సమీర్ విష్ణోయ్ భార్య ప్రీతి గోదారా పెద్ద మొత్తంలో ఆస్తులు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లు అంగీకరించింది. ఈడీ సోదాల్లో సమీర్ విష్ణోయ్ ఇంటి నుంచి రూ.47 లక్షల నగదు, రూ.21 లక్షల విలువైన ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన సునీల్ అగర్వాల్‌కు, సూర్యకాంత్ తివారీతో 10-15 ఏళ్లకు పైగా పరిచయం ఉంది. వీరిద్దరు కూడా ఐఏఎస్ అధికారులే. సూర్యకాంత్ తివారీకి చెందిన సంస్థ నుంచి రూ. 50 కోట్లకు రెండు వాషరీలను సునీల్ అగర్వాల్‌ కొనుగోలు చేశాడు. ఈ కేసులో మరో కీలక విషయం ఏంటంటే.. సత్య పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్ అండ్‌ ఇండస్ ఉద్యోగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమానులను బలవంతం చేసి సునీల్ అగర్వాల్‌కు విక్రయించడానికి రెండు నెలల ముందే సూర్యకాంత్ ఈ వాషరీలను కొనుగోలు చేశాడు. అక్రమంగా సంపాదించిన డబ్బును సూర్యకాంత్‌ వీటికి ఖర్చు పెట్టాడు. ఈ కొనుగోలు విషయంలో సునీల్ అగర్వాల్, సూర్యకాంత్ తివారీకి సహాయం చేశాడు. ఈ ముగ్గురితోపాటు మరో ముగ్గురిని కూడా ఈడీ అధికారులు అరెస్టు చేశారు.ఈ కేసులో అరెస్టయిన వారిలో ఒకరైన సూర్యకాంత్ తివారీ మామ లక్ష్మీకాంత్ తివారీ కూడా నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు ఆస్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. లక్ష్మీకాంత్ తివారీ ఇంటి సోదాల్లో మొత్తం రూ.1.5 కోట్ల డబ్బును అధికారులు కనుగొన్నారు. ఈ కేసును గురువారం విచారించిన ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక కోర్టు సమగ్ర విచారణ జరిపేందుకు నిందితులకు 8 రోజుల రిమాండ్ విధించింది. అక్టోబరు 21న వీరిని కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

Related Posts