ధర్మపురి శ్రీనివాస్. ఓహ్ ఇలా అంటే తెలియదేమో.. డీఎస్ అదేనండీ డి.శ్రీనివాస్ చిన్నకొడుకు అరవింద్ బీజేపీలో కీలకంగా మారాడు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్నీ తానై జనంతో మమేకం అవుతున్నారు. తండ్రి పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించి ప్రస్తుతం టీఆర్ ఎస్లో చేరి.. ఎంపీగా కొనసాగుతున్నారు. మున్నూరు కాపు వర్గానికి చెందిన డీఎస్ రాకతో ఆ వర్గం తనవైపు ఉంటుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. కానీ.. ఒకప్పుడు పార్టీనే నడిపిన డీఎస్కు ఇప్పుడు గులాబీ పార్టీలో అంత గొప్పగా ఏమిలేదట. చివరకు ఇమడలేక.. మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్దామని ప్లాన్ కూడా చేశారట.కానీ.. ఇంతలోనే చిన్నకొడుకు అరవింద్ బీజేపీలోకి చేరారు. పార్లమెంట్ స్థానంపైనే గురిపెట్టారు. దీనిపై బీజేపీ అదిష్ఠానం కూడా అరవింద్కు వెన్నంటే ఉంటుంది. ఇటువంటి నేపధ్యంలో కాంగ్రెస్ చూపు అరవింద్పై పడింది. యువకుడు.. ప్రజల్లో ఇమేజ్ ఉన్న నేత కావటంతో హస్తంలోకి ఆహ్వానించేందుకు మాజీ మంత్రి ఒకరు పూనుకున్నారట. పైగా రాబోయే ఎన్నికల్లో తాము ఏం చేయబోతామనేది కూడా పూసగుచ్చినట్లు వివరించారట. ఇప్పటికే బలమైన నేతలుగా తెలంగాణలో పేరున్న రేవంత్రెడ్డి, నాగం జనార్దన్రెడ్డిని హస్తం తనవైపు తిప్పుకుంది. అదే దారిలో ఇప్పుడు ధర్మపురి తనయుడు కూడా హస్తం చేయి అందుకుంటే.. కేసీఆర్కు ధీటుగా నిలవగలమనే భరోసా రెట్టింపు అవుతుందనేది టీ పీసీపీ నేతల ఆలోచన. మరి దీనిపై డీఎస్ తనయుడు ఏమని సమాధానమిస్తాడో.