కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులను పునర్నిర్మాణం చేసి, వాటి కింద ఆయకట్టును పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంవత్సరానికి ఒక ఫేజ్ చొప్పున ప్రస్తుతం నాలుగో ఫేజ్ పనులు నడుస్తున్నాయి. కాంట్రాక్టులు అప్పజెప్పడంలో రాజకీయ నాయకులు కీలకపాత్ర వహించడంతో అర్హత లేని కాంట్రాక్టర్లకు కూడా అధికారులు పెద్దపీట వేస్తున్నారు. ఫలితంగా పనులు నాణ్యవంతంగా జరగకపోవడం.. పెండింగ్లో పడటం నిత్యకృత్యంగా తయారైంది. మిషన్ కాకతీయ నిబంధనల ప్రకారం ఒక ఫేజ్లో టెండర్ వేసి కాంట్రాక్టు పొందిన వ్యక్తి ఆ పనులు నిర్దేశిత సమయం ప్రకారం, నాణ్యవంతంగా పూర్తి చేస్తేనే మరో ఫేజ్లో కాంట్రాక్టు పొందడానికి అర్హుడవుతాడు. కానీ వనపర్తి జిల్లాలోని ఐబీ అధికారులు ఒక ఫేజ్లో కాంట్రాక్టు పనులు పూర్తిచేయకున్నా.. మరో ఫేజ్లో కాంట్రాక్టు పనులను అప్పగించారు. నిబంధనలకు విరుద్ధమైనా అధికార పార్టీ అండదండలతో కాంట్రాక్టు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.
గతంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన పాన్గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలు నాగర్కర్నూలు ఐబీ డివిజన్ పరిధిలో ఉండేవి. మిషన్ కాకతీయ ఫేజ్-2 పనులు ఆ డివిజన్ కేంద్రంగానే నిర్వహించారు. టెండర్లు వేయడం, అగ్రిమెంట్లు అన్నీ అక్కడే జరిగాయి. నూతన జిల్లాగా వనపర్తి ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ-3,4కు సదరు మండలాలు వనపర్తి ఐబీ డివిజన్ పరిధిలోకి వచ్చాయి. తాజా వివాదంపై అధికారులు ఎంకే-2లో పనులు చేయకపోవడంపై నాగర్కర్నూలు ఐబీ అధికారులే చర్యలు తీసుకోవాల్సి ఉందని, కానీ వారు తీసుకోలేదని వనపర్తి అధికారులు పేర్కొంటున్నారు. వారు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడే వల్కలకుంట, అంబేడ్కర్ కుంట పనులు చేయని కాంట్రాక్టర్ను బ్లాక్లిస్టు పెట్టి పంపిస్తే.. తాము మిషన్ కాకతీయ-4 పనులను అప్పగించే అవకాశం ఉండకపోయేదని అం టున్నారు. అయితే సాధారణ నిబంధనల ప్రకారం ఏ కాంట్రాక్టర్కైనా పనులు అప్పగించేటప్పుడు.. ఆయన పూర్వపు కాంట్రాక్టుల వివరాలు.. పనిపూర్తి విధానం అన్నీ సూక్ష్మం గా పరిశీలించాలి. గతంలో చేసిన పనులకు సంబంధించి వర్క్ డన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. కానీ వనపర్తి ఐబీ అధికారులు అలాం టి వివరాలు సేకరించకుండానే ఎంకే -4 పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. జిల్లాలు ఏర్పడినప్పుడే పూర్తిస్థాయి ఫైల్స్ ఇక్కడి తెప్పించుకున్న అధికారులు చింతకుంటలో పనులు చేయని కాంట్రాక్టర్ వివరాలు, పెండింగ్లో ఉన్న పనులను ఈ రెండు ఫేజుల వరకు పరిశీలించలేకపోయారా? అనేది ప్ర శ్నార్థకంగా మారింది. దీని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉండటంతోనే అధికారుల సమాధానం దాటవేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అందరికీ వర్తించిన విధంగానే వర్తింపజేయాలని కోరుతున్నారు.
పాన్గల్ మండలం చింతకుంట గ్రామంలోని వల్కలకుంట, అంబేడ్కర్ కుంటను అధికారులు మిషన్ కాకతీయ ఫేజ్-2 కింద ఎంపిక చేశారు. టెండర్లు పిలిచి, ఓ వ్యక్తికి కాంట్రాక్టు అప్పగించారు. నిబంధనల ప్రకారం ఆ పనులు పూర్తి చేసిన తర్వాతనే మరో ఫేజ్లో కాంట్రాక్టర్కు పనులు అప్పగించాల్సి ఉంటుంది. కానీ అధికారులు రాజకీయ జోక్యంతో ఫేజ్-2లో పనులు అసలే చేయకున్నా.. ఆ కుంటలను ముట్టుకోకున్నా ఫేజ్- 4లో అదే మండలంలోని కేతేపల్లి గ్రామంలో కోనమల్లయ్యకుంట, న్యార్లకుంటకు టెండర్లు వేసి, పనులు అప్పగించారు. సాధారణంగా ఒక ఫేజ్లో పనులు చేయకపోతే సదరు కాంట్రాక్టర్ను డీఫాల్టర్గా ప్రకటించి, మిషన్ కాకతీయలో కాంట్రాక్టు వేయకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలి. కానీ సదరు కాంట్రాక్టర్కు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో ఐబీ అధికారులు జై కొట్టారు. వాస్తవానికి అనర్హుడైనా పనులు అప్పగించా రు. అయితే బుసిరెడ్డిపల్లి, గోవర్ధనగిరి తదితర గ్రామాల్లో టెండర్ వేసి అగ్రిమెంట్ చేసుకోక పోవడంతో సదరు కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టిన అధికారులు.. చింతకుంటలో అగ్రిమెంట్ చేసుకుని పనులు చేయని కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టకుం డా మిషన్ కాకతీయ ఫేజ్ -4లో పనులు అప్పగించారు. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉంటే ఒకలాగా.. లేకుంటే మరోలాగా అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రా మస్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై వనపర్తి ఐబీ కార్యాలయంలో గ్రామస్థులు ఫిర్యాదు కూడా చేశారు. సదరు కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టి, పనులు నిలిపివేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.