YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉద్యోగాల కోసం... కేంద్రం రోడ్ మ్యాప్

ఉద్యోగాల కోసం... కేంద్రం రోడ్ మ్యాప్

న్యూఢిల్లీ, జనవరి 18,
ఫిబ్రవరి 1, 2023న, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, మోదీ ప్రభుత్వం 2.0లో చివరి సాధారణ బడ్జెట్‌ సమర్పించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్. దీంతో పాటు, ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో, ఓటర్లను ఆకర్షించడానికి జనాదరణ బడ్జెట్‌ రూపొందిస్తారని అంతా నమ్ముతున్నారు. ఈసారి ప్రకటించే పద్దులో ఉపాధి కల్పన మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టబోతోంది. ఉద్యోగాల కల్పన, సంపద సమాన పంపిణీ (ఆర్థిక సమానత్వం), అభివృద్ధి పథంలో సాగడం వంటి అంశాలు రెడ్ ఫోల్డర్‌లో (బడ్జెట్‌) ఉంటాయని ఆర్థిక మంత్రి ఇటీవలే పేర్కొనడం కూడా ఇందుకు నిదర్శనం.ఫిబ్రవరి 1, 2022న 2022-23 బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మౌలిక సదుపాయాల బలోపేతం కోసం మూలధన వ్యయం కింద రూ. 7.5 లక్షల కోట్లు కేటాయించారు. ఇది ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు భారత్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడుతుందని అంచనా. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిన ప్రభుత్వం, ఈ బడ్జెట్‌లోనూ మూలధన వ్యయానికి ఎక్కువ నిధులు కేటాయించనుంది. ప్రభుత్వం ఈ పద్దు మీద ఎక్కువ ఖర్చు చేస్తే, అది ప్రపంచ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా సహాయపడుతుందియువతలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి బడ్జెట్‌ రూపంలో మోదీ ప్రభుత్వం భారీ ప్రకటన చేయవచ్చు, కొత్త పథకాన్ని ప్రకటించవచ్చు. ఎలాంటి హామీ లేకుండా యువ పారిశ్రామికవేత్తలకు రూ. 50 లక్షల వరకు రుణం అందుబాటులో ఉంచేలా ప్రకటన ఉండవచ్చు. ఇందులో, మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రుణంలో 50 శాతానికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. పురుష పారిశ్రామికవేత్తల విషయంలో 25 శాతం గ్యారంటీ ఇస్తుంది. వర్ధమాన పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వడం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడానికి ఆస్కారం ఉందిజూన్ 14, 2022న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక హామీ ఇచ్చారు. రాబోయే ఒకటిన్నర సంవత్సరాల్లో, అంటే 2023 చివరి నాటికి కేంద్ర ప్రభుత్వం తన వివిధ విభాగాలు & మంత్రిత్వ శాఖల్లో 10 లక్షల మందిని రిక్రూట్ చేసుకుంటుందని ప్రకటించారు. అన్ని విభాగాలు & మంత్రిత్వ శాఖల్లో మానవ వనరుల స్థితిగతులను స్వయంగా సమీక్షించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు నాటికి 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందికేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో దాదాపు 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. 2021 మార్చి 1వ తేదీ నాటికి, 9 లక్షల 79 వేల 327 పోస్టులు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాల పరిధిలో ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం రూపంలో తెలిపారు. 2021 డిసెంబర్ 1వ తేదీ వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 8,05,986 పోస్టులు మంజూరు అయ్యాయని, వాటిలో 41,177 బ్యాంకు ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని 2021 డిసెంబర్‌లో ఆర్థిక మంత్రి చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల వంటి విద్యాసంస్థల్లో దాదాపు 10,814 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం దేశంలోని త్రివిధ దళాల్లో దాదాపు 1.25 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ పూరించడానికి కసరత్తు కూడా జరుగుతోంది.ఇటీవలి కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నికల ప్రధానాంశంగా మారాయి. ఈ పరిస్థితుల్లో, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రోడ్‌మ్యాప్‌ను ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related Posts