ట్రాఫిక్ కారణంగా సమయానికి అంబులెన్స్ చేరుకోకపోవడంతో అత్యవసర సమయంలో ప్రాథమిక చికిత్స అందక ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం టూ వీలర్ అంబులెన్స్లను ఈ ఏడాది జనవరి 17న అందుబాటులోకి తీసుకొచ్చింది.గ్రేటర్ పరిధిలో తొలి విడతగా 38 టూ వీలర్ అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా ప్రారంభంలోనే వీటి సేవలపై పెద్దగా స్పందన కనబడలేదు. ప్రాథమిక చికిత్స అందించేందుకరు టెక్నీషియన్తో పాటు టూ వీలర్ డ్రైవింగ్ వచ్చిన వారు మాత్రమే వీటి సేవలకు అర్హులు. నగర ట్రాఫిక్కు బయపడి టెక్నీషియన్లు కూడా ఈ అంబులెన్స్లపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పైగా ప్రారంభంలో చేరిన వారు కూడా ఈ ఉద్యోగం నుంచి వెళ్లిపోతుండటంతో ఈ అంబులెన్స్ల సేవలకు ప్రజలు దూరమవుతున్నారు. ప్రారంభం మొదట్లో ఈ అంబులెన్స్లకు కేవలం యాక్సిడెంట్ కేసులు మాత్రమే అప్పగించే వారు, కానీ ఇప్పుడు మెడికల్ కేసులు కూడా అప్పగిస్తున్నట్లు తెలిసింది. వీటి సేవలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే అందుతాయి. బాధితులు 108కి కాల్ చేయగానే, క్షతగాత్రుడికి సమీపంలో ఉన్న టూ వీలర్ అంబులెన్స్ ముందుగా అక్కడకు చేరుకొని టెక్నీషియన్ ప్రాథమిక చికిత్స అందిస్తాడు. అనంతరం 108 వాహనము సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని వైద్యం నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలిస్తోంది. కానీ, టూ వీలర్ అంబులెన్స్లు అనుకున్నంత మేరగా ఫలితాలను ఇవ్వడం లేదు. సమయానికి సంఘటన స్థలానికి చేరుకోలేకపోతున్నాయి. ఈ మధ్య కాలంలో వీటి సేవలు నామ మాత్రంగానే కనిపిస్తున్నాయి. అత్యవసర సమయంలో ప్రజలకు తక్షణమే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అంబులెన్స్ల సేవలు నీరుగారుతున్నాయి.ఈ అంబులెన్స్లను ప్రారంభం నాటి నుంచి నేటికి పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు. ఆపద సమయంలో సమాచారం అందించిన సకాలంలో అక్కడకు చేరుకోకపోతుండటంతో వీటిపై ప్రజలకు నమ్మకం తగ్గుతోంది. పలు ప్రాంతాల్లో టూ వీలర్ అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో సమయానికి రాలేక పోతున్నాయి. అత్యవసర సమయంలో ఆదుకోలేకపోతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి వీటి సేవలు సకాలంలో అందెలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.