శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ సమస్య తీర్చకపోతే నిరాహారదీక్ష చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ పలాసలో కిడ్నీ బాధితులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 48 గంటల్లో సీఎం చంద్రబాబు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాను చేపట్టిన పోరాట యాత్ర ఆపి ఒక్కరోజు నిరాహారదీక్షకు దిగుతానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి నియమించడం...వెంటనే సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపుతారో చెప్పాలని అన్నారు. కిడ్నీ సమస్యపై పరిశోధన కోసం హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు సహకరిస్తామని పేర్కొనడం జరిగిందని..కేవలం మూడు డయాలిసిస్ కేంద్రాలు పెట్టి సరిపెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందని పవన్ పేర్కొన్నారు. కానీ ఇక్కడ కావాల్సింది బ్లడ్ బ్యాంక్ అనిఅయన అన్నారు. ఇంత దయనీయ పరిస్థితులున్నా, ఇక్కడ కనీసం మంచినీళ్లు ఇవ్వడం లేదని విమర్శించారు. .ఏడు మండలాల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కిడ్నీ వ్యాధులపై రీసెర్చ్ వర్క్ జరగాలన్నారు. కిడ్నీ సమస్య ఉందని ఆఖరి దశ వరకు తెలియడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు.