భూ రికార్డుల ప్రక్షాళన, పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బుధవారం వరకు జరిగిన భూమి అమ్మకం,కొనుగోళ్లకు సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేసి, దాని ప్రకారం అందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని చెప్పారు. పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను కూడా సవరించాలని కోరారు. వందరోజులపాటు భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పటికీ, ఇంకా కొన్ని చోట్ల రికార్డుల్లో తప్పులు దొర్లడం, అసమగ్ర వివరాలుండడం పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో పాటు, మానవ తప్పిదాలు కూడా ఉన్నాయని, దీని వల్ల రైతులకు కొంత అసౌకర్యం కలిగిందని, కొందరికి పాస్ పుస్తకాలు అందలేదని సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు కొన్ని సమస్యలు తప్పవని, ఈ పరిస్థితిని సవాల్ గా తీసుకుని, మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సిఎం కోరారు. జిల్లాల పునర్విభజన వల్ల కొత్త జిల్లాలు ఏర్పడ్డాయని, కలెక్టర్లకు పర్యవేక్షణ సులభమయిందని, దీన్ని సానుకూలాంశంగా తీసుకుని మరింత చిత్తశుద్దితో కార్యక్షేత్రంలో విధులు నిర్వహించాలని ఉద్భోధించారు. వచ్చే నెల నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుందని, రైతులకు జీవిత భీమా పథకం కూడా అమల్లోకి వస్తుందని, ఇవి సవ్యంగా సాగాలంటే భూమి రికార్డులు సరిగా ఉండాలని చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళన పరిపూర్ణమయి, భూమి యాజమాన్యంపై స్పష్టత వస్తే తప్ప ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందని సిఎం అన్నారు. కొన్ని సమస్యలు వచ్చాయని అధైర్య పడవద్దని, బుక్కులు, చెక్కులిచ్చే కార్యక్రమాన్ని వందశాతం విజయవంతం చేయడానికి పునరుత్తేజం పొందాలని సిఎం పిలుపునిచ్చారు.