శ్రీవారి ఆభరణాలపై టీటీడీలో ఐఏఎస్ అధికారులు, అర్చకులు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటూ ఆలయ ప్రతిష్టను , భక్తుల మనోభావాలను దెబ్బతీయడం బాధాకరమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి లో ఆయన మీడియాలో మాట్లాడుతూ టీటీడీ ధర్మకర్తల మండలికి సైరైన అవగాహన లేకుండా ,మొదటి సమావేశంలోనే అర్చకులపై చర్యలు ఎలా తీసుకుంటారని నవీన్ ప్రశ్నించారు. శ్రీవారికి యాభై వేల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు ఉన్నాయని వాటి లెక్కలు భక్తులకు చూపించాలని డిమాండ్ చేశారు. పింక్ డైమండ్ పగిలిపోయిందని, దాని విలువ వందల కోట్లు ఉంటాయని 2008 లో అప్పటి టీటీడీ ముఖ్య నిఘా భద్రత అధికారి రామనకుమార్ ఒక రిపోర్ట్ ఇచ్చారని.. కానీ ప్రస్తుత ఈఓ అసలు పింక్ డిమాండ్ లేదని, అది రూబీ అని ఎలా చెప్తారని ప్రశ్నించారు. దీనిపై అధికారులకు, అర్చకులకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేస్తే వాస్తవాలు బయట పడతాయని అన్నారు. వచ్చినవారు వచ్చినట్టుగా తిరుమల ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదంపై ప్రభుత్వం విచారణ జరిపి నిజానిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.