హైదరాబాద్, ఫిబ్రవరి 25,
వందేళ్ల కాంగ్రెస్ పార్టీని నిన్నగాక మొన్న పేరుమార్చుకుని జాతీయ అవతారం ఎత్తిన బీఆర్ఎస్ ఎక్కిరించడం కొత్త సామెత. అవును ఢిల్లీ లిక్కర్ స్కాం పుణ్యాన జాతీయ మీడియాలో తరచూ వినిపిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కాంగ్రెస్ ఎక్కిరించారు. ఎగతాళి చేశారు. ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను కవిత ఎద్దేవా చేశారు. ఒక జాతీయ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె, కాంగ్రెస్ పార్టీని చులకన చేసి మాట్లాడారు. అంతేకాదు హస్తం పార్టీ అహంకారం వీడాలని సలహా కూడా ఇచ్చారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనంగా ఉన్న మాట నిజమే కానీ, ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీలు అన్నిటిలో నిజమైన జాతీయ హోదా గుర్తింపు ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. సంఖ్యాపరంగా చూసినా పార్టీ మనుగడ పరంగా చూసినా బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే జాతీయ ప్రత్యామ్నాయం. ఇది బీఆర్ఎస్ మాత్రమే కాదు , కమలం పార్టీ కూడా కాదనలేని, అంగీకరించి తీరాల్సిన నిజం. మిగిలిన పార్టీలలో వేటికీ కూడా లోక్ సభలో మూడంకెల సంఖ్యను దాటిన చరిత్ర లేదు. సమీప భవిష్యత్ లో బీఆరేఎస్ సహా మరే ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏవీ కూడా మూడంకెల సంఖ్యకు చేరుకునే అవకాశం లేశ మాత్రంగా కనిపించడం లేదు.మరో వంక వందేళ్ళకు పైబడిన చరిత్ర ఇంచుమించుగా 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన అనుభవం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు పదేళ్లకు పైగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలను నడిపించిన అనుభవం ఉన్న పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయే. ఈ రోజుకు కూడా పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదాలో ఉన్నది కాంగ్రెస్ పార్టీకే. సో.. ఖర్గే చెప్పినా చెప్పక పోయినా సహజంగానే బీజేపీ వ్యతిరేక పార్టీలకు ప్రతిపక్షాలకు నాయకత్వం వహించేది కాంగ్రెస్ పార్టీయే. అందులో సందేహం లేదు. బీజేపీకి జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి. ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమి ఏర్పాటు కోసం కేసీఆర్ కాలికి బలపం కట్టుకుని దేశ మంతా తిరిగినా ఒక్కటంటే ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా కాంగ్రెస్ ను కాదని కేసీఆర్ తో జట్టుకట్టలేదు. చివరకు చేసేదేంలేక కేసిఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశం కోసం, ఎంట్రీ పాస్ గా టీఆర్ఎస్ పేరును, బీఆర్ఎస్ మార్చుకున్నారు. మరోవంక ఒక మమత బెనర్జీ, ఒక కేసీఆర్, ఒక అరవింద్ కేజ్రివాల్ మినహా మిగిలిన ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా శరద్ పవార్, నితీష్ కుమార్ ఎంకే స్టాలిన్ వంటి ఉద్దండ నాయకులు కాంగ్రెస్ చెయ్యి వదిలేది లేదని కుండబద్దలు కొట్టారు.చివరకు వామ పక్ష పార్టీలు కూడా ప్రాంతీయ స్థాయిలో ఏ పార్టీలతో పొట్టు పెట్టుకున్నా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఉంటుందని స్పష్టంగా చెపుతూనే ఉన్నాయి. నిజానికి నిజం ఏమిటో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ భవిష్యత్ ఏమిటో కవితకు తెలియంది కాదు. చివరకు కేంద్రంలోనే కాదు, అవసరం అయితే రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో చేతులు కలపక తప్పదనే విషయం కేసేఆర్ మొదలు కవిత వరకు అందరికీ తెలుసు. అలాగే, రాష్ట్రంలో అధికారం నిలుపుకునేందుకే బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలాన్ని గుర్తించడం లేదని అంటున్నారు.