హైదరాబాద్, మార్చి 1,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడవ సారి ముఖ్యమంత్రి అవుతారా? బీఆర్ఎస్ నాయకులు ఏ ఇద్దరు కలసిన ఇదే విషయం చర్చకు వస్తోంది. నిజానికి సర్వేలు ఏమి చెపుతున్నప్పటికీ, ఎన్నికలు ఎప్పుడు జరిగినా, బీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ వచ్చినా రాకున్నా కాంగ్రెస్ సహకారంతో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కొందరు నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ వస్తే మాత్రం కేసీఆర్ హ్యాట్రిక్ మిస్సవుతారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.అవును బీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ వస్తే, కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పరిమితం అవుతారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్ కు పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు అంతగా లేవని, అదుకే 2014లో వచ్చిన అత్తెసరు మెజారిటీ కూడా ఈసారి రాక పోవచ్చని అంటున్నారు. అదుకే, కేటీఆర్ లో అసహనం పెరుగుతోందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ ఎక్కడ మాట్లాడినా, విపక్షాల మీద విరుచుకు పడుతున్నారుముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా కేటీఆర్ చేస్తున్న విమర్శలు శృతి మించుతున్నాయని విమర్శకులు అంటున్నారు. చివరకు ప్రధాని మోడీని, తెలంగాణకు పట్టిన శని అనే స్థాయిలో విమర్శించారు. అదే విధంగా రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రను ఉద్దేశించి,కొందరు పనికిమాలిన పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అంటున్నారని, యాభై ఏళ్లు అధికారంలో ఉండి ఏం పీకారని దుయ్యబట్టారు.అలాగే వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ప్రీతి మరణం ఘటనను రాజకీయం చేస్తున్నారని విపక్షాలను తప్పుబట్టారు. ప్రీతిని హత్య చేసిన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు సైఫ్ అయినా సంజయ్ అయినా ఎవరినీ వదలమని కేటీఆర్ హెచ్చరించారు. ఇది ఆయనలో అసహనానికి నిదర్శనం కావచ్చునని బీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. సీఎం కుర్చీ దూరమౌతోందన్న భావనతోనే ఆయన విమర్శలు శృతి మించుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.