దేశంలో ఎక్కడ లేని విధంగా న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించిన ఘనత సీయం కేసీఆర్ కే దక్కుతుందని గృహ నిర్మాణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు చేసిన పోరాటాన్ని గుర్తించి వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా న్యాయవాదుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు తెలంగాణ న్యాయవాదుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రూ.100 కోట్లు కేటాయించారని చెప్పారు. సచివాలయంలో తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ పథకాలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ట్రస్ట్ సమావేశంలో ఎంపీ వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, ట్రస్ట్ కార్యదర్శి, న్యాయశాఖ అదనపు కార్యదర్శి బాచిన రామాంజనేయులు, ట్రస్ట్ సలహా మండలి సభ్యులు గండ్ర మోహన్ రావు, సహోదర్ రెడ్డి, మానిక్ ప్రభు గౌడ్, పుడ్ కమిషన్ సభ్యులు కొణతం గోవర్ధన్ రెడ్డి, న్యాయవాది కే.తిరుమల రావు పాల్గొన్నారు. జూన్ 2 నుంచి న్యాయవాదుల సంక్షేమ పథకాలను ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. న్యాయవాది, జీవిత భాగస్వామికి రూ.2 లక్షల ఆరోగ్య బీమా, ప్రమాదంలో మరణించిన న్యాయవాది కుటుంబానికి ప్రమాద బీమా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెల్లించేలా ట్రస్ట్ ఇన్సురెన్స్ కంపనీలతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఆరోగ్య బీమా కోసం యునైటెడ్ ఇండియా ఇన్సురెన్స్ కంపనీ ప్రతినిదికి రూ.8.50 కోట్ల చెక్కును, ప్రమాద బీమా కోసం ఒరియంటల్ ఇన్సురెన్స్ ప్రతినిదికి రూ.33.30 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. . ఆరోగ్య బీమా కోసం గ్రూప్ మెడిక్లెయిమ్ ఇన్సురెన్స్ పాలసీ ద్వారా 18 వేల మంది న్యాయవాదులు దరఖాస్తు చేసుకున్నారని, వారి జీవిత భాగస్వాములతో కలిపి మొత్తం 36 వేల మందికి ప్రమాద బీమా వర్తిస్తుందని వెల్లడించారు. తెలంగాణ న్యాయవాదుల కోసం ఆరోగ్య బీమా, ప్రమాద బీమా పథకాలతో పాటు ఇతర సంక్షేమ పథకాలను జూన్ 2న ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులది కీలక పాత్ర : ఎంపీ వినోద్ కుమార్
సీయం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.100 కోట్లతో న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ ఏర్పాటు : ఎంపీ బి.వినోద్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని ఎంపీ బి.వినోద్ కుమార్ అన్నారు.న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. న్యాయవాదులకు ఇన్సూరెన్స్ తో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఉద్యమ సమయంలో న్యాయవాదులది కీలక పాత్ర పోషించారని వారి సేవలను అని కొనియాడారు. సీఎం ప్రత్యేక చొరవతో వంద కోట్లతో అడ్వకేట్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు ఎంపీ వినోద్ కుమార్ గుర్తు చేశారు.- న్యాయవాది, అతని జీవిత భాగస్వామికి రూ.2 లక్షల మేరకు ఆరోగ్య బీమా పథకం వర్తింపజేయడం. - మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు ప్రమాద బీమా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం. - ఆయా జిల్లాల్లోని బార్ అసోసియేషన్లకు మెరుగైన వసతుల కల్పన పర్నీచర్, లైబ్రరీ,ఇతర నిర్వహణ ఖర్చుల కోసం న్యాయవాదుల సంఖ్యను బట్టి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడం. - నల్సార్ విశ్వ విద్యాలయం సహకారంతోజూనియర్ న్యాయవాదులకు Latest Laws, రిట్స్, క్రిమినల్, సివిల్ ప్రోసీజర్ కోడ్, డ్రాఫ్టింగ్ పై శిక్షణ తరగతులు నిర్వహించడం. ప్రతి సెషన్ ను 5 రోజుల పాటు కొనసాగించడం, ఒక్కో సెషన్ కు 100 మంది న్యాయవాదులకు శిక్షణ. ఒక్క సెషన్ నిర్వహణ ఖర్చు అంచనా రూ.8 లక్షలు. - జూనియర్ న్యాయవాదులకు వన్ టైమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద (2 సంవత్సరాల నుంచి 5 ఏళ్ల స్టాండింగ్ ఉన్న వారికి ) ఆఫీసు, లైబ్రరీ ఏర్పాటు కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం అందించడం. ఆర్థిక సహాయం అవసరమున్న అర్హులైన న్యాయవాదుల అభ్యర్థనను బట్టి నిధులు మంజూరు చేస్తారు.