హైదరాబాద్, మార్చి 21,
నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన పలు పనులు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ కుడివైపు మరో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ ఫ్లై ఓవర్ ని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ఐటి, పరిశ్రమలు శాఖామంత్రి కేటీఆర్ త్వరలో ప్రారంభించనున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైన ఫ్లై ఓవర్ మార్చి చివరి నాటికి ప్రారంభం కానుంది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేకంగా చొరవ చూపింది. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులలో ఇప్పటివరకు 35 పనులు పూర్తి కాగా వాటిలో ఎల్బీనగర్ ఆర్.హెచ్.ఎస్ ఫ్లై ఓవర్ 19గా అందుబాటులోకి రానున్నది. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులు కాగా జిహెచ్ఎంసి నిధులతో చేపట్టిన పనులలో 32 పనులు పూర్తయ్యాయి. మిగతా శాఖలకు సంబంధించిన ఆరింటిలో మూడు పూర్తికాగా మరో మూడు ప్రగతి దశలో ఉన్నాయి.గోల్నాక నుండి అంబర్ పేట్ వరకు గల ఈ ఫ్లై ఓవర్ జాతీయ రహదారుల శాఖ ద్వారా… ఉప్పల్ జంక్షన్ నుండి సి.పి.ఆర్.ఐ (మేడిపల్లి) వరకు గల ఫ్లైఓవర్, ఆరాంఘర్ నుండి శంషాబాద్ వరకు చేపట్టనున్న ఈ రెండు 6 లైన్ల ఫ్లైఓవర్లను రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టారు. అట్టి పనులు సత్వరమే పూర్తి చేసేందుకు జిహెచ్ఎంసి ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీకి సంబంధించిన రూ. 2335.42 కోట్ల విలువ గల వివిధ రకాల10 పనుల్లో ఫ్లై ఓవర్లు, ఇతర పనులన్నింటినీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంది. జిహెచ్ఎంసి ఎల్బీనగర్ ఆర్ హెచ్ ఎస్ ఫ్లై ఓవర్ ను సివిల్ పనులు, యుటిలిటి షిప్టింగ్ తో పాటు భూసేకరణతో సహా మొత్తం రూ.32 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేశారు.ఈ ఫ్లైఓవర్ ప్రారంభం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుండి ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుండి వచ్చే ప్రజలతో పాటు.. నగర వాసులకు హయత్ నగర్ మీదుగా నగరంలో ఇతర ప్రాంతాల వెళ్లేందుకు ఎంతగానో దోహద పడుతుంది. 700 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పు గల ఈ ఫ్లై ఓవర్ వల్ల వాహన వేగం కూడా పెరుగనున్నది. ఎల్ బి నగర్ జంక్షన్ వద్ద ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేరుగా వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుంది.