ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎంఎల్ఎస్ పాయింట్లలోనూ నిఘా కొరవడడంతో రీ సైక్లింగ్ దందా కొనసాగుతోంది. గ్రామీణ, పట్టణ లబ్ధిదారుల నుంచి వ్యాపారులు బియ్యం నేరుగా కొనుగోలు చేస్తున్నారు. తిరిగి అక్కడి నుంచి బడా వ్యాపారులకు అందిస్తున్నారు. మూతబడిన మిల్లులను ఎంచుకొని వాటిల్లో రీసైక్లింగ్ చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల మహారాష్ట్రలో మంచి డిమాండు ఉండటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నేరుగా కొనుగోలు చేస్తోంది. ఉభయ జిల్లాల్లో కలిపి నెలకు వెయ్యి మెట్రిక్ టన్నుల పైబడి బియ్యం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి లబ్ధిదారుల నుంచి ఇందులో సగానికి పైగా దుర్వినియోగం అవుతుండగా.. వేలిముద్రలు రావట్లేదన్న సాకుతో కొంత పక్కదారి పడుతోంది. మరోవైపు వేలిముద్రలు ఇచ్చే సమయంలోనూ అక్రమాలు జరుగుతున్నట్లు కూడా అధికారుల దృష్టికి వచ్చింది. ఇదే విషయమై ప్రస్తుతం ఉభయ జిల్లాల అధికారులు విచారణ కూడా ప్రారంభించారు.ఈ ఒక్క లోపంతోనే పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతోంది.. చిరు వ్యాపారుల నుంచి నేరుగా మిల్లర్ల చేతిలోకి చేరి రీసైక్లింగ్ అవుతోంది. తిరిగి రూపాయి బియ్యమే రూ. 28 నుంచి రూ. 35కు అందుతోంది.
చిన్న వ్యాపారుల నుంచి బడా వ్యక్తులు, మిల్లర్లు. రాత్రికి రాత్రి పీడీఎస్ బియ్యానికి పూతపూసి రూ.కోట్లు సంపాదిస్తున్నారు.గతంలో నిజామాబాద్లో ఓ మూతబడిన మిల్లులో పెద్దఎత్తున రీసైక్లింగ్ దందా బయటపడింది. తాజాగా బోధన్లోనూ ఇదే తరహాలో వెలుగులోకి రావటం ఆశ్చర్యకరం. ఇలాంటి రీసైక్లింగ్ దందా ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతోందిఉభయ జిల్లాల్లో ఎంఎల్ఎస్ పాయింట్లు 14 ఉన్నాయి. ఇందులో నిజామాబాద్ 7,900, కామారెడ్డి 5,431 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ముందస్తుగా నిల్వ చేసి ఉంచారు. ఒక్కో గోదాము అద్దె కనీసం రూ.25వేలు ఉంటుంది. వీటి నిర్వహణకు ఒక్కోదానికి కనీసం రూ.20వేలు ఖర్చు అవుతుంది. ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాల కోసం రూ.2 లక్షల వరకు వెచ్చించాలి. ఇవి కాకుండా గుత్తేదారునికి నెలకు రూ.లక్ష వరకు బిల్లులు చెల్లించాలి. ఇలా ఒక్కో ఎంఎల్ఎస్ పాయింటు మీద నెలకు రూ.3.50 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మొత్తం 14 వాటికి కలిపి నెలకు రూ.49 లక్షల వరకు ఖర్చు అవుతోందన్న మాట. సర్వేలో కేవలం 55 శాతం మంది మాత్రమే తింటున్నట్లు తేలింది. మిగతా 45 శాతంలో 10 శాతం మంది పిండి వంటలు, ఆల్పహారాల కోసం వాడుతున్నారు. మిగతా వారంతా రేషన్ దుకాణాల్లో తీసుకొంటున్న వెంటనే దుకాణాలు, వ్యాపారుల వద్ద విక్రయిస్తున్నారు.