YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాపం..శ్రీదేవి...

పాపం..శ్రీదేవి...

గుంటూరు, మార్చి 27, 
కొంత మంది అంతే.. అలా వచ్చి అలా వెళ్లిపోతారు. అదృష్టం తలుపుతట్టినా ఆలస్యంగా తెరిచే దురదృష్టవంతులు కొందరుంటారు. రాజకీయాల్లోనూ అంతే. చదువు, సామర్థ్యం, సామాజికవర్గం అన్నీ ఉండి అవకాశాలు రాని వారు అనేక మంది ఉంటారు. కోటిలో ఏ ఒక్కరికో పాలిటిక్స్ లో అవకాశం దొరుకుతుంది. దానిని సద్వినియోగం చేసుకోలేకపోతే ఇక అంతే. తొలి విడతతోనే తెరమరుగవుతుంటారు. తాత్కాలిక ప్రలోభాలకు ఆశపడితే శాశ్వతంగా దూరమయిన వాళ్లను రాజకీయాల్లో అనేకమందిని చూశాం. అందులో లక్ కొద్దీ తొలిసారి ఎమ్మెల్యే అయి తర్వాత స్యయంకృతాపరాధంతో రాజకీయ జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టుకున్న వాళ్లను చాలా మందిని చూశాం. అందులో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఒకరు. డాక్టర్ గా యమ బిజీగా ఉండే శ్రీదేవి తాను రాజకీయాల్లోకి వస్తానని ఊహించలేదు. వైఎస్ భారతితో పరిచయం ఆమె జీవితాన్ని మార్చింది. భారతి సిఫార్సుతో ఆమెకు తాడేపల్లి టిక్కెట్ జగన్ ఇచ్చారంటారు. డాక్టర్ గా సక్సెస్ అయిన ఉండవల్లి శ్రీదేవి పొలిటికల్ కూడా తొలి అడుగులోనే విజయం సాధించగలిగారు. అదీ జగన్ చరిష్మాతో అని వేరే చెప్పాల్సిన పనిలేదు. కానీ చక్కగా పనిచేసుకోవాల్సిన శ్రీదేవి గ్రూపులకు తెరదీశారు. తాడికొండలో తనకు తలనొప్పి తానంతటే తెచ్చుకున్నారు. తాడేపల్లి వైసీపీ రెండు వర్గాలుగా విడిపోవడానికి ఆమె కారణమయ్యారు. జగన్ ఫ్యామిలీతో ఉన్న సంబంధాలను కూడా ఆమె వినియోగించుకోలేకపోయారు. తద్వారా గెలిచిన తర్వాత కొద్ది రోజులకే తాడికొండ నియోజకవర్గంలో అసంతృప్తి బయలుదేరినా పార్టీ పెద్దలకు చెప్పి సరి చేసుకోక పోగా కోతిపుండు బ్రహ్మరాక్షసిగా చేసుకున్నట్లు ఆమె మరింత సమస్యను పెద్దదిగానూ, జటిలంగానూ చేసుకున్నారు. దీంతో పార్టీ అధినాయకత్వం అక్కడ మరొకరిని సమన్వయ కర్తగా నియమించే పరిస్థిితిని తనంతట తానే తెచ్చుకున్నారు. కేవలం ఒక వర్గాన్ని వెనకేసుకు రావడం, అక్కడి ఆధిపత్యం ఉన్న సామాజికవర్గంతో తలపడటం ఉండవల్లి శ్రీదేవికి తలనొప్పి తెచ్చిందని చెప్పాలి. అంతటితో ఆగినా సరిపోయేది. కానీ ఆమె ఊరుకోలేదు. మరింత కాలుదువ్వారు. దీంతో ఆమెపై ఉన్న వ్యతిరేకతను గమనించి అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికలలో డొక్కా మాణిక్యవరప్రసాద్ ను ఎంపిక చేయకుండా క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదని నేరుగానే చెప్పింది. దీంతో ఉండవల్లి శ్రీదేవి తనకు టిక్కెట్ రాదని డిసైడ్ అయిపోయారు.. పోనీ వేరే పార్టీలోకి వెళితే ఎలాంటి పదవులు దక్కవు. వారు ఇచ్చిన హామీలు కూడా అమలు కావని ఆమెకు తెలియంది కాదు. తమ ప్రయోజనం నెరవేరిన తర్వాత అసలు మొఖం కూడా చూడని వైపు ఆమె టర్న్ అయ్యారు. పోనీ జగన్ ను కలసినప్పుడు ఆమెకు అక్కడి నుంచి మార్చి వేరే చోట టిక్కెట్ ఇస్తామని చెప్పినా ఆమె విని ఉంటే బాగుండేది. మరోచోట టిక్కెట్ లేదో మరోసారి ఎమ్మెల్సీ పదవి అయినా దక్కేది. అలా కాకుండా క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోయారు. ఇప్పుడు ఆమెకు వేరే దారి లేదు. రాజకీయంగా ప్రభావం చూపగలిగిన నేత అయినా ఏదో ఒక పార్టీ దరిచేర్చుకునేది. కానీ డాక్టర్ కు ఆ క్వాలిఫికేషన్ కూడా లేదు. ఈ ఏడాది కాలంలో ఆమె నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అక్కడ కాలు మోపితే వైసీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకమవుతుంది. ఇలా తొలిసారి ఎమ్మెల్యే అయి సింగిల్ టైం శాసనసభ్యురాలిగా మిగిలిపోయిన ఉండవల్లి శ్రీదేవి తనంతట తానే రాజకీయంగా జీవితాన్ని సమాధి చేసుకున్నారు.
పార్టీపై హాట్ కామెంట్స్
వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తాడికొండలోని పార్టీ ఆఫీస్ పై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. అసలు తాను చేసిన తప్పు ఏంటని ప్రశ్నించారు. రాజధాని ఏరియాలో తనను అడ్డంపెట్టుకొని కొందరు వైసీపీ నేతలు అక్రమంగా ఇసుక దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటికి తాను అడ్డంకిగా మారినందుకే తప్పించారని కామెంట్స్ చేశారు."నేను ఓటేసిన టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా..? నేను మాత్రమే క్రాస్ ఓటింగ్ చేశానని తేల్చారు.జనసేనతో పాటు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రాజధాని పరిధిలో ఎమ్మెల్యేగా ఉన్న నన్ను తప్పించాలని కుట్ర చేశారు. అందరిచేత తిట్టించేలా ప్లాన్ చేశారు. దొంగ అనేలా నాపై ముద్ర వేశారు. నన్ను పిలిచి మాట్లాడితే పక్కకు జరిగేదాన్ని కాదా...? ఆంధ్రప్రదేశ్ లో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఉందా లేదా అనేది అర్థం కావటంలేదు. అమరావతి ఇక్కడే ఉంటుందంటూ ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరికి చెప్పాను. ఈ విషయంలో నేను మాట ఇచ్చాను. అందరు నమ్మి నాకు ఓటేశారు. ఇవాళ ఆ దారి నుంచి వెళ్తుంటే... అమరావతి రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వారిని చూసి ప్రతిరోజు బాధపడేదాన్ని. అమరావతిలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది. ఎస్సీలపై తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నారు. ఇవాళ ఓ ఎమ్మెల్యేగా నేనే భయపడుతున్నాను. సామాన్యులు అసలు ఆంధ్రప్రదేశ్ లో తిరిగే పరిస్థితి లేదు" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు శ్రీదేవి.ఇక నుంచి అమరావతి రైతులతోనే ఉంటానని ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు. ప్రాణం పోయినా సరే అమరావతి రైతులకు మద్దతు ఉంటుందన్నారు. అమరావతి రాజధాని ఉద్దండయ్యపాలెంలో ఇసుక మాఫియా ఎవరిది. దానికి నేను అడ్డం వస్తున్నాను అని ఈ విధంగా నన్ను పార్టీ నుంచి తప్పించారు. రాజధానిగా అమరావతే ముద్దు అని చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేసి డబ్బులు తీసుకుంటున్న వారికి శ్రీదేవి సవాల్ విసిరారు. ఏ దేవుడి వద్ద అయినా… ప్రమాణం చేయటానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. తనకు ఏదైనా జరిగితే ప్రభుత్వ సలహాదారు సజ్జలదే బాధ్యత అని తేల్చి చెప్పారు. తన భద్రతపై పూర్తి నమ్మకం కలిగితేనే ఆంధ్రప్రదేశ్ కు వస్తానని చెప్పుకొచ్చారు.
"నా కళ్లు తెరిపించిన అమరావతి రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎమ్మెల్యేగా నేను అండగా ఉంటాను. మీ పక్కనే కూర్చుంటాను. ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్కరికి మద్దతుగా ఉంటాను. అమరావతిని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేకు రక్షణకు లేని పరిస్థితి ఏపీలో ఉంది. దిశా యాప్స్ ఎక్కడ పోయాయ్...? వైసీపీ గుండాలతో పచ్చి బూతులు తిట్టిస్తున్నారు. త్వరలోనే మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాను. జగన్ గారు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది. పార్టీ కోసం ఎంతో పని చేశాను. ప్రస్తుతం ఏ పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదు. ప్రస్తుతం స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నా. మరోసారి మీడియా ముందుకు వస్తాను" అని శ్రీదేవి స్పష్టం చేశారు.

Related Posts