YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కరెంట్ బాదుడు

 ఏపీలో కరెంట్ బాదుడు

విజయవాడ, ఏప్రిల్ 1, 
ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ భారం మోపేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే ఏపీలో శ్లాబులు మార్పు, ఫిక్స్‌డ్‌ ఛార్జీల పెంపు, ట్రూఅప్‌ భారాల విద్యుల్ పంపిణీ సంస్థలు వేల కోట్ల రూపాయల భారాన్ని మోపాయి.ఇకపై ప్రతి నెల ట్రూఅప్‌ ఛార్జీలు వసూలు చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి గత బుధవారం ఉత్తర్వులను విడుదల చేసింది. డిసెంబర్‌ 29వ తేదీన కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ తీసుకొచ్చిన గెజిట్‌ ఆధారంగా ఎపిఇఆర్‌సి తాజా ఉత్తర్వులను విడుదల చేసింది.ఈఆర్‌సి కార్యదర్శి రాజబాపయ్య గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. విద్యుత్‌ సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోడానికి ప్రతి నెల విద్యుత్‌ వినియోగదారులపై ఆ భారం మోపాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నెలనెలా ట్రూ అప్ ఛార్జీ వసూలు చేయనున్నారు.ఖర్చులకు అనుగుణంగా ప్రతి నెలా విద్యుత్‌ ఛార్జీలు పెంచుకునేందుకు డిస్కమ్‌లకు ఈఆర్‌సీ అనుమతి వచ్చింది. ప్రతిరోజూ పెట్రోల్‌ ధరలు ఎలా పెరుగుతాయో, ఇకపై విద్యుత్‌ ఛార్జీలూ ప్రతి నెలా పెరగనున్నాయి. గతంలో ఏడాదికొక్కసారి ట్రూఅప్‌ విధానం ఉండేది. ఛార్జీలు వసూలు చేయాలంటే ఎపిఇఆర్‌సి బహిరంగ విచారణ జరిపేది. అందరి అభిప్రాయాలూ తీసుకునేది.కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగా ఏడాది విధానాన్ని డిస్కమ్‌లు మూడు నెలలకు మార్చాయి. కేంద్రం గెజిట్‌కు అనుగుణంగా ఫిబ్రవరి 10వ తేదీన ఈ విధానంపై అభ్యంతరాలు, సలహాలు కోరుతూ ముసాయిదాను ఈఆర్‌సి విడుదల చేసింది. కొత్త విధానాన్ని రాజకీయ పార్టీలు, విద్యుత్ రంగ నిపుణులు వ్యతిరేకించినా, అమలు చేయడానికే మొగ్గు చూపింది. ఇకపై అన్ని కేటగిరీలకు యూనిట్‌కు 40 పైసలు చొప్పున ట్రూ అప్ ఛార్జీగా వసూలు చేసుకునే ప్రతిపాదనకు అనుమతిచ్చింది.ఏప్రిల్‌ ఒకటోతేదీ నుండి ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రతి నెలా ఛార్జీల వసూళ్లతో పాటు ఏడాది చివరలో ఇంధన సర్దుబాటు వ్యయం ఛార్జీలకు మించి ఉంటే అదనంగా వసూలు చేసుకునే అవకాశం కూడా డిస్కమ్‌లకు కల్పించింది. ఇకపై ప్రతి నెల ట్రూఅప్‌ ఛార్జీలతో పాటు, ఏడాది చివరిలో మరో ట్రూఅప్‌ భారం ప్రజలపై మోపే అధికారం డిస్కంలకు ఉంటుంది. వీటిపై బహిరంగ విచారణ జరపాలన్న నిబంధన కూడా ఏమి లేదు. డిస్కమ్‌లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రూఅప్‌ ధరలను వసూలు చేసుకోవచ్చు.బొగ్గు ధరలు, విద్యుత్‌ కొనుగోలు ధర, ట్రాన్స్‌మిషన్‌ ధరలు పెరిగిన ప్రతిసారీ వాటిని వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవచ్చని ఈఆర్‌సి తెలిపింది. ఏపీలో ఇప్పటికే రూ.2910 కోట్ల ట్రూఅప్‌ భారాన్ని గతేడాది ఆగస్టు నుంచి డిస్కమ్‌లు ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయి. 2024 జనవరి వరకు వీటిని వసూలు చేస్తారు. మరో రూ.3,083 కోట్ల ట్రూఅప్‌ ఛార్జీలను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకూ వసూలు చేస్తారు. ట్రూఅప్‌ పేరుతోనే రూ.5,993 కోట్లను ప్రజల నుంచి డిస్కమ్‌లు వసూలు చేస్తున్నాయి. ఈ వసూళ్లను వ్యతిరేకిస్తూ పలు ప్రజాసంఘాలు, విద్యుత్‌ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఇఆర్‌సి పట్టించుకోలేదు.విద్యుత్‌ ఛార్జీలను పెంచలేదని చెబుతూనే సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయడం మోసపూరితమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. 2023 ఏప్రిల్‌ నుంచి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతినెలా విద్యుత్‌ యూనిట్‌కు 40 పైసలు చొప్పున అదనంగా సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయడాన్ని తప్పు పట్టారు.ఏడాది చివరిలో అవసరమైతే అదనంగా సర్దుబాటు భారం మోపే ప్రమాదమూ ఉందని ఆరోపించారు. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రూ.1400 కోట్లు విద్యుత్‌ ఛార్జీలు భారం మోపిందని, 2014-19 మధ్య వినియోగించుకున్న విద్యుత్‌కు ఇప్పుడు 36 నెలలపాటు యూనిట్‌కు 25 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల రూ.2,900 కోట్ల భారం పడిందని వివరించారు. 2020-21లో వినియోగించుకున్న విద్యుత్‌పై యూనిట్‌కు 65 పైసలు వరకు 2023 ఏప్రిల్‌ నుంచి అదనంగా వసూళ్లకు ఆదేశాలు ఇచ్చారని, ఈ పేరుతో రూ.3,083 కోట్ల భారం వినియోగదారులపై పడనుందని తెలిపారు.

Related Posts