YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందా

కర్ణాటక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందా

బెంగళూర్, ఏప్రిల్ 4, 
కర్ణాటకలో కూడా హిమాచల్ ప్రదేశ్ లో లాగా ఏ పార్టీకి రెండు సార్లు అధికారం ఇవ్వని ట్రెండ్ ఉంది.1985 నుంచి కర్ణాటకలో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. మరి ఈ సారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే టెన్షన్ ఆయా పార్టీల్లో నెలకొంది. డబుల్ ఇంజన్ సర్కారుతో కర్ణాటకలో అభివృద్ధి సాధ్యమని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కమలం పార్టీ భావిస్తోంది.మోడీ దేశంలో అందిస్తున్న పాలనపైనే బీజేపీ శ్రేణులు నమ్మకం పెట్టుకున్నాయి. అయితే కర్ణాటకలో బీజేపీకి లింగాయత్ సామాజిక వర్గం మద్దతు, సంఘ పరివార్ సంస్థాగత బలం కలిసిరానున్నాయి. డిజిటల్ మీడియా ప్రచారంలో బీజేపీ కర్ణాటకలో స్ట్రాంగ్‌గా ఉంది. ఇటీవల అవినీతి ఆరోపణల కేసులో బీజేపీ ఎమ్మెల్యే విరుపాక్షప్ప అంశం బీజేపీని చిక్కులో పడేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యేపై కూడా చర్యలకు ఉపక్రమించడం ద్వారా అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదనే మెసెజ్ ప్రజల్లో ఇచ్చినట్లు భావిస్తోంది.2024 లోక్ సభ ఎన్నికలతో పాటు త్వరలో ఆయా రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక ఎన్నికలు ఆయా పార్టీలకు అత్యంత కీలకం కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ మాత్రం కాంగ్రెస్ దే హవా అని ప్రకటించాయి. మొత్తం 224 స్థానాల్లో 117 నుంచి 127 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఏబీపీ- సీ ఓటర్ సర్వే తేల్చింది. సీఎంగా బస్వారాజు బొమ్మై పాలన సరిగా లేదని 50.5 శాతం మంది తేల్చారు. ఎగ్జిట్ పోల్స్ అనంతరం బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. బీజేపీ ప్రధాని మోడీపైనే ఈ దఫా గట్టి నమ్మకం పెట్టుకుంది. కేంద్రంలో అమలు చేస్తున్న పథకాలనే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. కర్ణాటకలో బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కమలనాథులు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ దఫాలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో నేరుగా రంగంలోకి దిగనున్నారు.ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, 40శాతం కమీషన్ల ముద్ర బీజేపీని కలవరపెడుతోంది. ఈ సారి ఈ రెండు అంశాలే కీలకం కానున్నాయి. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలో ప్రచారం నిర్వహించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘టిప్పుసుల్తాన్ వర్సస్ హనుమాన్’ అంటూ భావోద్వేగాలను టచ్ చేశారు. ఈ సారి కూడా కాంగ్రెస్ టార్గెట్‌గా హిందుత్వ అంశాన్ని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లడంపై బీజేపీ ఫోకస్ పెట్టిందికాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత కరెంట్, గ్రాడ్యువేట్లకు నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2వేల ఆర్థిక సాయం వంటివి ఓటర్లపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో తేలాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని హస్తం పార్టీ భావిస్తోంది. వీటితో పాటు నిత్యావసర ధరల పెంపు అంశాన్ని టార్గెట్ చేయనున్నాయి. అయితే కాంగ్రెస్‌లో వర్గ పోరు ఆ పార్టీకి సంకటంగా మారాయి.మాజీ సీఎం సిద్ధరామయ్య, ప్రస్తుత పీసీసీ చీఫ్ శివ కుమార్ మధ్య పోరు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. సౌత్‌లో ఎలాగైనా పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి కర్ణాటక కీలకంగా మారింది. బీజేపీ కంచుకోట ఆ పార్టీకి చేజారితే ఆ ఎఫెక్ట్ తెలంగాణపై కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఆది నుంచి మద్దతు ఇస్తున్న కుమారస్వామి పార్టీ జేడీఎస్ సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తా లేకపోవడంతో కాంగ్రెస్‌తోనే మళ్లీ కలిసి నడిచే ఛాన్స్ ఉంది. హస్తం పార్టీ దేశ వ్యాప్తంగా తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీపై వ్యతరేకత ఉందని దేశ వ్యాప్తంగా ప్రచారం చేసుకోవచ్చని హస్తం పార్టీ భావిస్తోంది.తాము మద్దతు ఇచ్చే పార్టీ గెలిస్తే బీజేపీ పని అయిపోందని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లొచ్చని తద్వారా తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావొచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఫైర్ అవుతూనే ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి ఎలాగైనా బీజేపీని గద్దె దించడం ద్వారా సౌత్‌లో అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని బీజేపీకి దక్కకుండా చూడాలని బీఆర్ఎస్ భావిస్తోంది.మరి ఇప్పటికే కాంగ్రెస్ విషయంలో సాఫ్ట్‌గా వ్యవహరిస్తున్న గులాబీ బాస్ కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తారా అనే అంశం ఆసక్తి రేపుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు ఒకే తాటిపైకి రావాలనే డిమాండ్ వేళ కేసీఆర్ నిర్ణయం పట్ల ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్- జేడీఎస్‌కు మద్దతు ఇచ్చి అక్కడ ఒక వేళ ఈ రెండు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్ పార్టీకి జాతీయ స్థాయిలో మైలేజ్ పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. కర్ణాటకలో పోటీ చేయడం కన్నా మద్దతు ఇవ్వడమే బెటర్ అని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. మరి కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయి. బీజేపీ సౌత్ టార్గెట్‌ మిస్ కాకూడదంటే కర్ణాటకలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిన అనివార్యత ఏర్పడింది. మరి ఏ పార్టీ వైపు కర్ణాటక ప్రజలు నిలుస్తారు. ఏ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయనే విషయాలు తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే..

Related Posts