YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ టూర్ పై ఆసక్తి

మోడీ టూర్ పై ఆసక్తి

హైదరాబాద్, ఏప్రిల్ 4, 
నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 8వ తేదీన ఆయన హైదరాబాద్ రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రూ. 11 వేల 355 కోట్ల విలువైన పనులకు ప్రధాని శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిపారు. అయితే ఈ మీటింగ్ లో మోడీ స్పీచ్ పై ఆసక్తి ఏర్పడుతోంది. సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నేరుగా విమర్శలు చేస్తున్న తరుణంలో మోడీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. గత పర్యటనలో బేగంపేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ప్రధాని రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అవినీతి పరులను వదిలిపెట్టేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయం వేడెక్కింది. లిక్కర్ స్కాంలో కవిత పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ అంశాలు ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది. జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కేసీఆర్ వంటి నేతలు కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నింటికి మించి ఈ ఏడాదే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామంటే తామే అని బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నాయి. మోడీని ఇరుకున పెట్టేలా రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ రియాక్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టూర్‌లో ప్రధాని తన స్పీచ్‌లో కేసీఆర్, కాంగ్రెస్ విషయంలో డోస్ పెంచుతారా అనేదానిపై రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మోడీ మాత్రం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తాము అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని తద్వారా పేదలకు అందాల్సిన ఫలాలు అందడం లేదనే విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారనేది బలంగా వినిపిస్తోంది.
షెడ్యూల్ ఇలా
8వ తేదీన తొలుత సికింద్రాబాద్ - తిరుపతి మధ్యన సేవలు అందించనున్న వందేభారత్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇది దేశంలో ప్రవేశపెట్టనున్న 13 వ వందేభారత్ రైలు. ఈ రైలు కారణంగా సికింద్రాబాద్ - తిరుపతిల మధ్యన ప్రయాణ సమయం 12 గం. ల నుండి 08 గం. ల 30 ని. లకు తగ్గిపోనున్నది. భాగ్యనగరం హైదరాబాద్ నుండి ఆధ్యాత్మిక నగరం తిరుపతికి ప్రయాణించనున్న వారికి అనుకూలంగా ఈ వందేభారత్ రైలు సేవలు ఉండనున్నాయి.రూ. 715 కోట్లు ఖర్చు చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నందు చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. ఇందులో భాగంగా రాబోయే 40 సంవత్సరాల వరకు ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను అందించటానికి వీలుగా రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 25,000 మంది ప్రయాణికుల నుండి రద్దీ సమయంలో 3,25,000 మంది ప్రయాణికులకు కూడా సౌకర్యాలను అందించగలిగేలా రైల్వే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచనున్నారు. రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం ఉన్న 11,427 చదరపు మీటర్ల బిల్డింగ్ ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలతో 61,912 చదరపు మీటర్లకు పెంచటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్ ఫామ్స్ ను కలిపేలా 108 మీటర్ల ప్రత్యేక డబుల్ లెవెల్ వంతెనను ఈ స్టేషన్ నందు ఏర్పాటు చేస్తారు. ఆధునికీకరణ పనులలో భాగంగా ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లకు, రాటిఫైల్ బస్ స్టేషన్ కు నేరుగా కనెక్టివిటీని ఏర్పాటు చేయనున్నారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, వచ్చే/వెళ్ళే ప్రయాణికులకు ప్రత్యేక మార్గాల ఏర్పాటు వంటి అనేక వసతులను అభివృద్ధి పనులలో భాగంగా కల్పించనున్నారు.సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ మధ్యన రూ. 1,410 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసిన 85 కి. మీ. ల పొడవైన డబ్లింగ్ రైల్వే లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. సామాన్య ప్రజల రైలుగా మన్ననలు పొందిన ఎంఎంటీఎస్ ఫేజ్ - II లో భాగంగా హైదరాబాద్ నగర శివారు పట్టణాల వరకు నిర్మించిన నూతన రైల్వే లైన్ల మీదుగా నడవనున్న 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రధాని ప్రారంభిస్తారు. ఎంఎంటీఎస్  ఫేజ్ - II లో భాగంగా బొల్లారం మరియు మేడ్చల్ మధ్యన 14 కి. మీ. లు, ఫలక్ నుమా మరియు ఉందానగర్ మధ్యన 14 కి. మీ. ల పొడవున కొత్త డబ్లింగ్ లైన్లను నిర్మించడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు, వాటి ప్రయోజనాలకు సంబంధించి రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనను ప్రధాని తిలకించనున్నారు. ఇకపై నగరం శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే సామాన్య ప్రజలు అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి పరేడ్ గ్రౌండ్ లో  ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధానమంత్రి చేరుకుంటారు. పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న తరువాత మొదట రూ. 7,864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 6 జాతీయ రహదారులకు, రూ. 1,366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ నందు చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ లో అకడమిక్ కోర్సులకు అనుగుణంగా బిల్డింగ్ బ్లాక్ ల నిర్మాణం, ఆడిటోరియం, స్టాఫ్ క్వార్టర్లు, హాస్టల్స్, గెస్ట్ హౌస్ లు, హాస్పిటల్ బ్లాక్ ఆధునికీకరణ వంటి పనులను చేపట్టనున్నారు. ప్రాజెక్టుల భూమిపూజ కార్యక్రమం అనంతరం బహిరంగ సభకు హాజరైన మోదీ... ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Related Posts