హైదరాబాద్
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న (శనివారం) రెండు గంటల పాటు హైదరాబాద్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వెళ్తారు. తొలుత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పనులు పూర్తయిన హైదరాబాద్-మహబూబ్నగర్ రైల్వే డబ్లింగ్ లైన్ను జాతికి అంకితం చేస్తారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి పరేడ్ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచే అయిదు జాతీయ రహదారుల పనుల ప్రారంభం, బీబీనగర్ ఎయిమ్స్ కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. చివర్లో బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 12.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరుగుప్రయాణం అవుతారని భాజపావర్గాలు తెలిపాయి. మొదట ఉదయం 9.30 గంటలకే ప్రధాని హైదరాబాద్కు వచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించినా తర్వాత 10.30 గంటలకు మారినట్లు వివరించారు.