YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో ప్రతీకార అరెస్టులు తప్పవా...

తెలంగాణలో ప్రతీకార అరెస్టులు తప్పవా...

హైదరాబాద్, ఏప్రిల్ 8, 
నీ బిడ్డ జైలుకు పోతాది.. నీ కొడుకుకు కూడా జైలు రెడీ చేస్తున్నాము " అని టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన తర్వాత బండి సంజయ్ .. జైలు ముందే సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. బండి సంజయ్‌ అరెస్ట్ తర్వాత బీజేపీ హైకమాండ్ చేసిన ప్రకటనలు.. స్పందించిన విధానం చూస్తే.. ఈ అంశంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అనుకోవచ్చు. నిజానికి ఇప్పుడు బీఆర్ఎస్,  బీజేపీ మధ్య  ఉప్పు, నిప్పులా పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ జుట్టు  బీజేపీ చేతుల్లో ఉంది. అయినా బీఆర్ఎస్ రిస్క్ తీసుకుంది. బండి సంజయ్ విషయంలో దూకుడుగా వ్యవహరించింది. అది బీజేపీని రెచ్చగొట్టడమా  లేకపోతే వ్యూహాత్మక తప్పిదమా అన్నది  ముందు ముందు తెలుస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు  ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేస్తున్నరు. కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు కానీ.. కల్వకుంట్ల కవిత ఇచ్చిన పది ఫోన్లను విశ్లేషిస్తున్నట్లుగా తెలుస్తోంది. మళ్లీ నోటీసులు ఇస్తారా లేదా అన్నది స్పష్టత లేదు. కానీ అరెస్ట్ మాత్రం చేయలేదు. అరెస్ట్ వరకూ వచ్చిందని అందరూ అనుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తులంతా అరెస్టయ్యారు. వారికి  బెయిల్ దక్కడం కూడా గగనంగా మారింది. అత్యంత కీలక వ్యక్తిగా ఈడీ, సీబీఐ న్యాయస్థానాలకూ  చెబుతూ వస్తున్న కవితను  మాత్రం అరెస్టు చేయలేదు.  ఆ రెండు దర్యాప్తు  సంస్థలు అనుకుంటే ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. అదే సమయంలో ఫామ్ హౌస్ కేసు కూడా సీబీఐ చేతిలో ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కాదు తదుపరి దర్యాప్తు  చేయవద్దని చెప్పింది. ఇవాళ కాకపోతే రేపైనా ఆ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్తుంది. అ కేసులో సాక్ష్యాలు బయట పెట్టిన సీఎం కేసీఆర్‌కూ ఇబ్బందులు తప్పవని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్‌ను టార్గెట్ చేశారు. వరుసగా జరుగుతున్న పేపర్ లీక్‌ల విషయంలో ప్రభుత్వంపై వస్తున్న  విమర్శలను తగ్గించుకునేందుకు బండి సంజయ్‌పై ప్రభుత్వం కుట్ర చేసిందని బీజేపీ అగ్రనాయకత్వ నమ్ముతున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అరెస్టుపై ప్రధాని మోదీ కూడా వివరాలు తెలుసుకున్నారని అంటున్నారు. బండి సంజయ్ తెలంగాణ  బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన  తర్వాత పార్టీ భారీగా పుంజుకుంది. అందుకే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు.. బండి సంజయ్‌పై ప్రత్యేకమైన అభిమానం ఉంది.  ఇప్పుడు బండి సంజయ్‌నే అరెస్టు చేశారంటే వారు తేలికగా తీసుకోరని అంటున్నారు. కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నారు. ఆమెకు జైలు సిద్ధం చేశామని బండి సంజయ్ గతంలో ప్రకటించారు. కరీంనగర్ జైలు నుంచి  బయటకు వచ్చిన తర్వాత బండి సంజయ్.. కేటీఆర్ ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు. ఆయనకు  కూడా జైలు సిద్ధం చేస్తామన్నారు. కేటీఆర్‌కు సంబంధించి వారి వద్ద ఏమైనా సమాచారం ఉందేమోనన్న అనుమానాలు ఈ ప్రకటనతో ప్రారంభమయ్యాయి. బీజేపీ అగ్రనాయకత్వ ప్రతీకారం తీర్చుకోవాలంటే.. వెంటనే ఏమీ చేసేయదని.. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని ... ఆ పార్టీ వ్యూహాలపై అవగాహన ఉన్న  వారు చెబుతున్నారు. తాము కక్ష సాధింపులకు  పాల్పడ్డామని ప్రజలు అనుకోకుండా.. పద్దతిగా ప్రతీకారం తీర్చుకుంటుందని చెబుతున్నారు. ఈ తరహాలో కేటీఆర్, కవితలను టార్గెట్ చేశారా అన్న సందేహాలు ప్రారంభమవుతున్నాయి. కారణం ఏదైనా  బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం టైమింగ్ కరెక్ట్ కాదన్న అభిప్రాయం బీఆర్ఎస్ క్యాడర్‌లో వినిపిస్తోంది. అయితే అన్నీ ఆలోచించే బీఆర్ఎస్ చీఫ్ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారని.. బీజేపీ ట్రాప్‌లో పడుతోందని.. త్వరలోనే అసలు విషయం వెలుగులోకి వస్తుందని కొంత మంది విశ్లేషిస్తున్నారు. ఏదైనా  తెలంగాణలో అరెస్టుల రాజకీయాలు డీకోడ్ చేయడం క్లిష్టమే.

Related Posts