YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సోము దెబ్బ... కమలంలో ఏం జరుగుతోంది

సోము దెబ్బ... కమలంలో ఏం జరుగుతోంది

విజయవాడ, మే 10, 
ఆంధ్రప్రదేశ్ బీజేపీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పార్టీ నేతలకు బయటకు పంపాలనే చూస్తుంది. ఎన్నికల ముందే వీరిని వదిలించుకోవాలని చూస్తుంది. పార్టీలో ఉంటూ కోవర్టులుగా ఉన్న వీరిని వీలయినంత త్వరగా పార్టీ నుంచి బయటకు పంపడమే మేలని భావిస్తుంది. ఇప్పటికే ఇద్దరు బీజేపీ నేతలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. వీటికి సమాధానం చెప్పిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారం పూర్తి కావడంతో వీరి వ్యవహారాన్ని అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల ఒక న్యూస్ ఛానల్‌లో విశాఖ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రస్తావన, బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదని మోదీకి తాను చెప్పానని చెప్పడం వంటి కారణాలపై ఆయన సంజాయిషీని కోరింది. అయితే తాను గతంలో మోదీకి ఒంటరిగా వెళితే బీజేపీకి ఏపీలో ఒక్క సీటు కూడా రాదని లేఖ రాశానని విష్ణుకుమార్ రాజు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై రాష్ట్ర నాయకత్వం కూడా కేంద్ర నాయకత్వమే చర్యలు తీసుకునేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే విష్ణుకుమార్ రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది.ఇక మరో కీలక నేతకు కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌కు ఈ నోటీసులు జారీ చేసింది. నారా లోకేష్ కర్నూలు నగరంలో పాదయాత్ర చేస్తుండగా ఆయనకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో టీజీ వెంకటేష్ ఫొటో ఉండటంపై వివరణ కోరింది. టీజీ వెంకటేష్ బీజేపీలో ఉండగా, ఆయన కుమారుడు టీజీ భరత్ మాత్రం కర్నూలు టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. అయితే బీజేపీలో ఉంటూ టీడీపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తుండటంతో ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది ఇక ముందు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఒకే కుటుంబంలో ఉండేవారు ఒకే పార్టీలో ఉండేలా తీర్మానం చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. అలా తీర్మానం చేస్తే ఉన్నవాళ్లు ఉంటారు.. ఇష్టం లేని వాళ్లు పార్టీ నుంచి వారంతట వాళ్లు వెళ్లిపోతారని భావిస్తున్నారు. జమ్మలమడుగులోనూ ఆదినారాయణ కుటుంబంలో కొందరు టీడీపీలోనూ, ఆదినారాయణ రెడ్డి బీజేపీలోనూ కొనసాగుతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలసి పనిచేస్తాయని ఇటీవల వ్యాఖ్యానించిన ఆదినారాయణరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. వీరందరిపై చర్యలు తీసుకునే దిశగా పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం నుంచి అనుమతి తీసుకుని త్వరలోనే ఈ ముగ్గురిపై వేటు పడే అవకాశాలున్నాయి.
నాకు నోటీసులా
సోము వీర్రాజు షోకాజ్ కు మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్పందించారు. తన కుటుంబ సభ్యులు టీడీపీలో ఉన్నారని, అది అందరికీ తెలుసునని టీజీ అన్నారు. కొత్తగా సోము వీర్రాజు నోటీస్ ఇచ్చేది ఏంటి అని ఆయన ప్రశ్నించారు. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం హాస్యాస్పదమని టీజీ వెంకటేష్ కొట్టిపారేశారు. మరి దగ్గుబాటి సంగతేంటో? అలాగయితే దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ నుండి పోటీ చేసిందని, దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైసీపీ నుండి పోటీ చేశారన్న విషయాన్ని టీజీ వెంకటేష్ గుర్తు చేేశారు. దగ్గుబాటి పురంధరేశ్వరికి ఒక న్యాయం, తనకో న్యాయమా అంటూ ఆయన ప్రశ్నించారు. షోకాజ్ నోటీసులకు భయపడేది లేదని వెంకటేష్ అన్నారు.

Related Posts