ఎన్నికల్లో భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ చెప్పారు. టిటిడిపి మహానాడులో రమణ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధమవుతున్నామని అన్నారు.గురువారం నాడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వార్థం కోసం కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఓ కుటుంబం లాంటిదని, ప్రజాసేవే పరమావధిగా పని చేస్తున్నామని అన్నారు. చంద్రబాబు అండతో మళ్లీ తెలంగాణలో చరిత్ర తిరగరాస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు, పాలించే సత్తా టీడీపీకే ఉందని అయన అన్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే పార్టీ టీడీపీనేనని వెల్లడించారు. కేసీఆర్ పాలనలో కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యం దక్కుతుందని ఆరోపించారు. పేదలు, రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు.
తాము అధికారంలోకి వస్తే ప్రగతిభవన్ను ప్రజా ఆస్పత్రిగా మారుస్తామని ప్రకటించారు. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని ఎల్.రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రావుల చంద్రశేఖర్రెడ్డి, పెద్దిరెడ్డి, పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. మరోవైపు, మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడట్టంతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై మహానాడు వేదికగా చర్చిస్తున్నారు. మహాసభలో మొత్తం ఐదు తీర్మానాలు చేయనున్నట్లుసమాచారం. ఇవే తీర్మానాలను విజయవాడ వేదికగా జరిగే మహానాడులో ప్రవేశపెట్టనున్నారు.