YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ కు ప్రియాంక చికిత్స....

కాంగ్రెస్ కు ప్రియాంక చికిత్స....

హైదరాబాద్, మే 11, 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకింకా ఆరు నెలల గడువుండగానే టీ.కాంగ్రెస్ నేతలు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. యూత్ డిక్లరేషన్ పేరిట అగ్రనేత ప్రియాంకా గాంధీ చేత యువతకు గాలమేస్తూ తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ ఓ వరాల జల్లును ప్రకటించారు. రూ.4 వేల రూపాయల నిరుద్యోగ భృతి, మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాల భర్తీ వంటి ఆశలు యువతలో రేకెత్తించేలా యూత్ డిక్లరేషన్ రూపొందించారు. తన సొంత లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసుకున్న బహిరంగ సభలో తన బలాన్ని చాటేందుకు, తనకున్న ఫ్యాన్ ఫాలొయింగ్‌ని అధిష్టానానికి తెలియజెప్పేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. అంతా ఎదురు చూసిన ప్రియాంకా గాంధీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. ఇపుడే అసలు సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. కష్టాల కాంగ్రెస్‌ను ప్రియాంక గట్టెక్కిస్తారా..? తెలంగాణలో తొలిసారిగా అడుగుపెట్టిన ఇందిర వారసురాలు.. నిజంగానే ఆమె వారసురాలని అనిపించుకుంటారా…? తాజాగా ప్రియాంకా గాంధీ సభ తర్వాత ఇవే ప్రశ్నలు అన్ని చోట్ల వినిపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తన చేతులమీదుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు అస్సలు ఊహించ లేదు. కానీ వారి అంచనాలను, ఊహలను తారు మారు చేసింది తెలంగాణ ప్రజానీకం. దాన్ని అనుకూలంగా మలచుకున్న కేసీఆర్.. తెలంగాణలో విపక్షమనేదే లేకుండా చేసుకునే వ్యూహాన్ని అమలు చేశారు. దాదాపు సక్సెస్సయ్యారు కూడా. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో మూడింట రెండొంతుల మంది టీఆర్ఎస్ (ఇపుడు బీఆర్ఎస్) పార్టీలో చేరిపోయారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. కేసీఆర్ మిత్ర పక్షమయిన ఎంఐఎం పార్టీనే ఇపుడు తెలంగాణలో గుర్తింపు పొంది ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు అదే తెలంగాణ గడ్డపై ఎలాగైనా ఫినిక్స్ పక్షిలా ఎగరాలన్నది కాంగ్రెస్ పార్టీ కల. అందుకు ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేస్తోంది. తాజాగా యువ సంఘర్షణ పేరిట ప్రియాంకాగాంధీని రంగంలోకి దించడం, డిక్లరేషన్ పేరిట హామీలు గుప్పించడం లాంటివి అందులో భాగమే.అయితే కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితికి దిగజారడానికి కారణాలు ప్రత్యేకంగా వెతుక్కోవాల్సినవసరం లేదు. ఒకప్పుడు పార్టీలో ఎటు చూసినా హేమా హేమీలే కనిపించేవారు. అలాంటి తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రాగానే… చాలా మంది నేతలు అధికార పార్టీలోకి దూకేశారు. కాంగ్రెస్ పార్టీతో అనుబంధానికి గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు కానీ, గడిచిన దశాబ్దా కాలంలో … ఒకప్పుడు తాము కాంగ్రెస్ నేతలమన్న సంగతిని వారు కూడా మర్చిపోయేంతగా వారిలో మార్పు వచ్చింది. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నేతల్లో సఖ్యత గురించి, ఆ పార్టీలో ఎప్పుడూ ఉండే ప్రజాస్వామ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొనే… గాంధీ భవన్ సాక్షిగా పార్టీలో ఎవరి దారి వారిదే అన్నట్టుంది పరిస్థితి. నిజానికిది పార్టీలో కొత్తగా వచ్చిన మార్పేమీ కాదు.. 80వ దశకం నుంచి ఈ ధోరణి కాంగ్రెస్ పార్టీలో వుండింది. అయితే పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఢిల్లీ కాంగ్రెస్ నేతలపై తెలంగాణలో మెజార్టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు అంతెత్తున మండిపడ్డారు. వాటి ప్రభావం హుజారాబాద్ ఉప ఎన్నికల్లో ఓ మాదిరిగా కనబడ్డా… మునుగోడు బై ఎలక్షన్స్‌ నాటికి ఓ క్లారిటీ వచ్చేసింది. సోదరుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత అన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి… పార్టీలో సృష్టించిన అలజడి.. ఆస్ట్రేలియా టూర్‌కెళ్లి.. అక్కడ పార్టీపై మాట్లాడిన మాటలు… టి.కాంగ్రెస్ నేతలు ఎంత కలిసికట్టుగా ఉన్నారో తెలంగాణ జనాలకు క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత కూడా సీనియర్లు సృష్టించిన అలజడికి తెలంగాణ కాంగ్రెస్ ఒకప్పటి ఇంచార్జ్ మాణికం ఠాగూర్ ఈ తెలంగాణ కాంగ్రెస్‌కో దండం అంటూ వెళ్లిపోయిన సంగతి కూడా తెలుసు. ఆ తర్వాత కొత్త ఇంచార్జ్ అ రావడం… బుజ్జగింపులు, బతిమాలడాలు… కాంగ్రెస్ నేతలకు కొత్త కాదు… దశాబ్దాలుగా చూస్తున్న తెలంగాణ జనాలకు కొత్తగా ఏం అనిపించలేదు. కొత్త ఇంచార్జ్ రావడం వల్ల ఎంత వరకు ఫలితం ఉందా అంటే అది కూడ క్వశ్చన్ మార్కే. ఇన్ని కుమ్ములాటలు… కొట్లాటలు, గ్రూపులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో ప్లస్ ఏదైనా ఉందంటే కార్యకర్తల బలం. ఇంకా మిగిలే వున్న ఓటు బ్యాంకు కూడా పార్టీ నేతల్లో దింపుడు కల్లం ఆశలు రేపుతోంది. దాన్ని నమ్ముకునే నాయకులు అన్ని రకాల యాత్రలు చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక అనే అస్త్రాన్ని తెలంగాణలో ప్రయోగిస్తోంది కాంగ్రెస్. చూడ్డానికి అచ్చం నాటి ఇందిరమ్మను తలపించే ప్రియాంక… ఎలాంటి మ్యాజిక్ చేస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న. యూపీ ఎన్నికల్లో ఫస్ట్ టైం నేరుగా పార్టీని గెలిపించే బాధ్యతలు స్వీకరించారు ప్రియాంక. యోగీ దెబ్బకు యూపీలో పెద్దగా మ్యాజిక్ ఏం జరగకపోయినా… ఆమె గురించి యూపీ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మాత్రం అంతో ఇంతో తెలిసింది. అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లో చురుగ్గానే ఉంటూ వస్తున్నారు. తాజాగా కర్నాటక ఎన్నికల ప్రచారంలో కూడా తన సోదరుడు రాహుల్‌తో పాటు బరువు బాధ్యతల్ని తన భుజాలపైనే మోశారు. అలా అక్కడ ఎన్నికల ప్రచారం ముగిసిందో లేదో.. నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే కాబట్టి… ఇక్కడ మీటింగ్ ప్లాన్ చేశారు. నిరుద్యోగ సంఘర్షణ సభ పేరుతో గడిచిన పదేళ్లుగా తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై సరూర్ నగర్ సభ సాక్షిగా సమర శంఖం పూరించారు. సరిగ్గా 43 ఏళ్ల క్రితం… ఇందిరాగాంధీ సృష్టించిన మ్యాజిక్ ప్రియాంకా గాంధీ సృష్టించగలరా..? తాజా సభతో చర్చ ఆ దిశగానే జరుగుతోంది. నిజానికి 1980లో జరిగిన మ్యాజిక్ గురించి ఈ తరంలో చాలా మందికి తెలియకపోవచ్చు కానీ… పాత తరం నేతలకు, ఇంట్లో 50 ఏళ్లు దాటిన వారికి బాగానే గుర్తుంటుంది. 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. నిజానికి అప్పటికి ఆమె 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటగా భావించే రాయ్ బరేలీ నుంచి జనతా కూటమి అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతుల్లో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమెను కాంగ్రెస్‌ బలంగా ఉండే దక్షిణాదిలో పోటీ చెయ్యాలని అప్పటి సీనియర్ నేతలు సూచించారు. వారి సూచన మేరకు మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగారు. సుమారు 2 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆమె ఒక్కరే కాదు… ఆమెతో పాటు అప్పుడు తెలంగాణలో ఉన్న 15 లోక్ సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 42 లోక్ సభ స్థానాలుంటే అందులో 41 స్థానాల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. మిగిలిన ఒక్క స్థానమైన పార్వతీపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ యూ తరపున గెలిచారుసో.. అప్పుడు ఇందిర కష్టాల్లో ఉంటే… ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది. అదే తేడా. మరి అప్పుడు ఇందిరమ్మ ఆదుకున్న తెలంగాణను.. ఇప్పుడు అచ్చం ఇందిరమ్మ రూపంలోనే ఉంటుందని భావించే ప్రియాంక గాంధీ మెస్మరైజ్ చేస్తారా అన్నదిపుడు పెద్ద ప్రశ్న. మే 8న జరిగిన సరూర్ నగర్ సభలో ఆమె ప్రసంగించిన తీరు చూస్తే ఇందిరమ్మ దింపేసినట్లే అనిపించింది. తనను ఇందిరమ్మ అని సంబోధించడం తనపై బాధ్యతను పెంచేసిందంటూ తెలంగాణ బాధ్యతలను ఆమె భుజానికెత్తుకున్నట్లే కనపించారు. ఇందిర రూపం మళ్లీ వర్కౌట్ అవుతుందా..? మే 8 నాటి సభ ప్రధాన ఉద్ధేశం అదే. కాంగ్రెస్ నేతలంతా ఆమె మ్యాజిక్ పని చేస్తుందనే భావిస్తున్నారు. మరోవైపు పార్టీలో ఏ చిన్న తేడా వచ్చినా హైకమాండ్ దగ్గరే తేల్చుకుంటాం అనే నేతలకు.. ఇప్పుడు నేరుగా ప్రియాంక రూపంలో ఆ హైకమాండే వాళ్ల దగ్గర కొచ్చింది. తమ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు గురించి హైకమాండ్‌కేం చెబుతారో చూడాలి. అయితే ఇప్పుడు ప్రియాంక వచ్చినప్పుడు కూడా ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి విదేశీ పర్యటనలో ఉండటం విశేషం.ఇక్కడ ఇంకో సంగతి ప్రస్తావించాలి. ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు.. వైఎస్ సీఎంగా ఉండగా అంటే 2009లో జరిగిన ఎన్నికల్లోనే తెలంగాణలో ప్రియాంక గాంధీ ప్రస్తావన వచ్చిందని కూడా చెబుతారు. మెదక్ నుంచి ఇందిర పోటీ చేసినట్టు… 2009 ఎన్నికల్లో ప్రియాంకను కూడా మెదక్‌ నుంచి పోటీ చెయ్యాలని అభ్యర్థించాలని నాటి కాంగ్రెస్ నేతలు భావించారట. కారణాలు ఏవైతేనేం అది జరగలేదు. ప్రస్తుతం ప్రియాంక వచ్చిన పని అది కాకపోవచ్చు. కాంగ్రెస్ నిరుద్యోగ సంఘర్షణ సభ మాత్రమే కావచ్చు. కేవలం అటు బీఆర్ఎస్‌ను.. ఇటు బీజేపీని టార్గెట్ చెయ్యడానికే కావచ్చు. ఆ పని తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఎప్పటి నుంచో చేస్తున్నారు. సో… ప్రియాంక నుంచి ఆశిస్తున్నది కేవలం విమర్శలు మాత్రమే కాదు… తమను టార్గెట్ చేస్తున్న పార్టీలపై ఎదురుదాడి చెయ్యడం మాత్రమే కాదు… నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్లో సరికొత్త జోష్‌ నింపేలా ఆమె యాక్షన్ ప్లాన్ ఉండాలన్నది వారి ఆశ. అందుకు మే 8న జరిగిన సభలో వేదికపై ఓ వైపు ఇందిర ఉంటే మరో వైపు ప్రియాంక గాంధీ ఫోటోలు పెట్టడమే సాక్ష్యం. నాటి ఇందిరమ్మే మళ్లీ వచ్చిందని …. తమను గట్టెక్కిస్తుందని… పీసీసీ చీఫ్ రేవంత్ సహా అందరూ ముమ్మాటికీ నమ్ముతున్నారు. ఆ విషయం ప్రియాంకకు కూడా బాగా అర్థమయ్యింది. అందుకే 43 ఏళ్లయిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు ఇంకా ఇందిరమ్మను గుర్తుంచుకున్నారంటూ ఆమె ప్రస్తావనను తీసుకొచ్చారు. మాటలు బాగానే ఉన్నాయి. తనను నయా ఇందిరమ్మగా భావిస్తున్న వారికి అన్యాయం చెయ్యనన్న ప్రియాంక… తెలంగాణ విషయంలో ఇకపై ఎలాంటి స్టెప్స్ వేస్తారన్నదే యావత్ టి.కాంగ్రెస్ నేతల మదిలో మెదులుతున్న ప్రశ్న. మరి యూపీలో సక్సెస్ కానీ ఈతరం ఇందిరమ్మ…తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెప్పిస్తారా..? అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను కాదని… బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని పదే పదే చెబుతున్న బీజేపీని కాదని.. మ్యాజిక్ చేస్తారా.. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఊపిని, సరికొత్త రూపాన్ని ఇచ్చి పార్టీని అందలమెక్కిస్తారా..? ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.

Related Posts