హైదరాబాద్, మే 13,
తెలంగాణ గవర్నర్ తమిళసైకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరం చెరిగిపోయి, వివాదాలు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు గవర్నర్ ప్రసంగించారు.అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అమోదించిన బిల్లులను గవర్నర్ అమోదించకుండా తన వద్దే ఉంచుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో ఈ వ్యవహారం చర్చకు వచ్చిన సమయంలో గవర్నర్ కొన్ని బిల్లులకు అమోదం తెలపడంతో పాటు మరికొన్నింటిని వెనక్కి తిప్పి పంపారు. మరికొన్నింటిని న్యాయసమీక్షకు పంపారు.పెండింగ్ బిల్లులపై గవర్నర్ కార్యాలయం చర్యలు తీసుకోవడంతో సుప్రీం కోర్టు కూడా విచారణ లేకుండానే వివాదాన్ని ముగించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో కూడా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. గురువారం భద్రాచలంకు రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ వెళ్ళారు.బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాఫ్టర్లో భద్రాచలం వెళ్లారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామిని దర్శించుకుని భద్రాచలంలోని శ్రీ కృష్ణ మండపంలో హెల్త్ అవేర్ నెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రాచలంలోని గిరిజన అభ్యుదయ భవన్ కు వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాచలంలో గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.గత కొంత కాలంగా గవర్నర్ పర్యటనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కొద్ది నెలల క్రితం జరిగిన భద్రాచలం సీతారాము కల్యాణోత్సవాలకు సైతం గవర్నర్ వాహనంలోనే వేడుకులకు హాజరయ్యారు. ఇతర జిల్లాల పర్యటనలు, అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు కార్లలోనే ప్రయాణించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా హెలికాఫ్టర్ సమకూర్చలేదని గతంలో ఆరోపించారు. గవర్నర్ వ్యవహార శైలితోనే ప్రభుత్వం కూడా సహాయ నిరాకరణ చేసిందనే ప్రచారం జరిగిందిఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గవర్నర్తో అనవసర వివాదాలతో సమయం వృధా చేయడంపై ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మునుపటి మాదిరి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.రాజ్భవన్తో ఘర్షణ వైఖరి వల్ల సమయం వృధా కావడం తప్ప ఎలాంటి ఫలితం ఉండదని గ్రహించడంతోనే సామరస్య వైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, విధానపరమైన నిర్ణయాలను శాసనసభలో ప్రకటించి వాటిని బిల్లుల రూపంలో గవర్నర్కు పంపి అమోదింప చేసుకోవాలన్నా ఘర్షణ వైఖరితో అసాధ్యమని గుర్తించారు. అదే సమయంలో గవర్నర్ సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని గుర్తించడంతో మునుపటిలా సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గవర్నర్ పర్యటనలకు హెలికాఫ్టర్లు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది.