YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు

తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు

తెలంగాణ రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం వెల్లడించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరగడంతో జోన్ల వ్యవస్థను కూడా పునర్విభజించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలు చెప్పారు. ఈ ప్రతిపాదనలపై గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి చర్చించారు. జోన్లు, మల్టీ జోన్లు ఖరారు చేశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు అజయ్ మిశ్రా, నర్సింగ్ రావు, శివశంకర్, ఆధార్ సిన్హా, భూపాల్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు దేవీ ప్రసాద్,కారం రవీందర్ రెడ్డి, శ్రీనివాస గౌడ్, ఎంపి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, ఆరూరి రమేష్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలోని 31 జిల్లాలను వివిధ జోన్లు, మల్టీ జోన్లుగా విభజించిన అంశాన్ని ఉద్యోగులకు తెలియచేయడంతో పాటు ఇతర అంశాలు చర్చించడానికి శుక్రవారం టిజివో భవన్ లో సమావేశం జరుగనుంది. ఉద్యోగుల  సమావేశం తర్వాత వారి అభిప్రాయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి నోట్ పంపుతారు. దీనిపై కేబినెట్ సమావేశం జరుగుతుంది. జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థకు కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే కేంద్రానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి, తెలంగాణలో కొత్త జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చేలా చూస్తానని సిఎం చెప్పారు. 

జోన్ల వివరాలు: 

1. కాళేశ్వరం జోన్ (28.29 లక్షల జనాభా): భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి

2. బాసర జోన్ (39.74 లక్షల జనాభా): ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల

3. రాజన్న జోన్ (43.09 లక్షల జనాభా): కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్

4. భద్రాద్రి జోన్ (50.44 లక్షల జనాభా): కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్

5. యాదాద్రి జోన్ (45.23లక్షల జనాభా): సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ

6. చార్మినార్ జోన్(1.03 కోట్ల జనాభా): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి

7. జోగులాంబ జోన్ (44.63 లక్షల జనాభా): మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్

మల్టీ జోన్లు: 

1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి (1.61 కోట్ల జనాభా)

2. యాదాద్రి, చార్మినార్, జోగులాంబ (1.88 కోట్ల జనాభా)

Related Posts