YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

మరి కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ముగియనుండటంతో తిరుమలకు ఎన్నడూ లేనంతగా భక్తులు పోటెత్తారు. గతవారం రోజుల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో సప్తగిరులు కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు గత మూడు రోజుల నుంచి పూర్తిగా నిండిపోయాయి. మరోవైపు, స్వామి దర్శనం కోసం విచ్చేస్తున్న భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ నారాయణగిరి ఉద్యానవనం దాటి క్యూలైన్ కిలోమీటర్ల పొడవుసాగింది. గురువారం ఉదయం తిరుమలకు వచ్చేవారికి 48 గంటల తరువాతే దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో రద్దీపై వస్తున్న వార్తలను స్వయంగా తెలుసుకున్న సీఎం చంద్రబాబు, నేటి ఉదయం అధికార్లతో ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. భక్తుల తాకిడిని ముందుగానే అంచనా వేసి, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని, అన్నపానీయాలకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. గాలిగోపురం వద్ద భక్తుల రద్దీపై స్పందించిన సీఎం, రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉందన్న విషయాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సమాచారంతో పరిశీలించి, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, స్వామివారి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. భక్తులు ఎన్నో కష్టాలు పడి శ్రీవారికి తమ బాధలు చెప్పుకునేందుకు వస్తారని.. వారికి స్వామివారి దర్శనభాగ్యం కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల సేవే స్వామివారి సేవగా సిబ్బంది, అధికారులు భావించాలని సూచించారు. టిక్కెట్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరినందుకే సమస్య ఏర్పడిందని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. 

Related Posts