YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చల్మెడ వర్సెస్ చెన్నమనేని

చల్మెడ వర్సెస్ చెన్నమనేని

కరీంనగర్, జూన్ 14, 
వేములవాడ బీఆర్ఎస్ ఆధిపత్య పోరు మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేనికి చెక్ పెట్టేందుకు చల్మెడ పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వేములవాడలో బీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో రాజన్న సన్నిధిలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇంతకాలం చక్రం తిప్పిన చెన్నమనేని రమేష్ బాబుకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు జురుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. వేములవాడలో టికెట్ ఆశిస్తున్న మరో నేత చల్మెడ లక్ష్మీనరసింహరావు క్యాంప్ కార్యాలయం ప్రారంభించడం చర్చకు దారితీసింది. దీంతో వేములవాడలో చల్మెడ వర్సెస్ చెన్నమనేని రాజకీయం నడుస్తోందని స్థానికులు అంటున్నారు.వేములవాడ మల్లారం క్రాసింగ్ వద్ద చల్మెడ లక్ష్మీ నరసింహరావు క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రభాకర్ రావు క్యాంప్ ఆఫీసును ఓపెన్ చేశారు. వేములవాడ నుంచి చల్మెడ లక్ష్మీనరసింహరావు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆయన క్యాంప్ ఆఫీసు ప్రారంభించడం సంచలనం అయింది. ఈ ఆఫీస్ తన వ్యక్తిగతమని ఇక్కడ ప్రజలకుసేవలందించేందుకు అందుబాటులో ఉంటానని చల్మెడ చెప్తున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందని చర్చ మొదలైంది. చల్మెడ బీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచీ వేములవాడ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును కాదని మరో నేతకు టికెట్ ఇస్తారా? అన్న అనుమానం కూడా వ్యక్తమైంది. అయితే చల్మెడ మాత్రం తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.చల్మెడ ఆనందరావు ఆసుపత్రి ద్వారా వేములవాడ పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని లక్ష్మీనరసింహరావు తెలిపారు. సేవా కార్యక్రమాలు మరింతగా అందించేందుకు క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. మరోరకంగా అవకాశం ఇస్తే సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నానని లక్ష్మీనరసింహరావు తెలిపారు. అయితే ఈ ఆఫీస్ తన వ్యక్తిగతమన్న ఆయన...పార్టీ కార్యాలయం మాత్రం కాదని తేల్చి చెప్పారు. అధిష్టానం అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. వ్యక్తిగత క్యాంప్ ఆఫీసు ఏర్పాటుతో చల్మెడ రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వేములవాడకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. కొద్ది కాలంగా వేములవాడలో చల్మెడ లక్ష్మీ నరసింహరావు , ఎమ్మెల్యే రమేష్ బాబు మధ్య టికెట్ కోసం వివాదం కొనసాగుతోంది. ఇద్దరు నేతలు ఎవరికి వారే తనదే టికెట్ అంటూ అనుచరుల వద్ద చెబుతున్నారు. ఇందులో భాగంగా ఎవరికి వారే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇరువురు అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చల్మెడ క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించడం మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో వేములవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.

Related Posts