హైదరాబాద్, జూన్ 16,
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. కొత్త ఎత్తులు, కొత్త పొత్తులు తెరపై కొస్తున్నాయి. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయంతో లెక్కలు మారిపోయాయి. అంత వరకు తెలంగాణ రాజకీయాల్లో మూడవ స్థానంలో ఉందని అనుకున్న హస్తం పార్టీని విశ్లేషకులు పై మెట్టుకు తీసుకుపోయారు. బీజేపీని మూడవ స్థానంలోకి నెట్టేశారు.అదే సమయంలో బీజేపీలో అంతవరకు కొంత గుంభనంగా ఉన్న అంతర్గత విభేదాలు, ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అలకలు,లుకలుకలు బయట కొచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ అధ్యక్షడు బండి సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య పార్టీ నేతలు గీతలు గీసుకున్నారు. రెండుగా విడిపోయారు. రహస్య భేటీలు, నాయకుల ఢిల్లీ యత్రాలతో మీడియా కథనాలు, మేథావుల విశ్లేషణలతో బీజేపీ ఇమేజ్ డ్యామేజైంది. దీనికి తోడు గత నాలుగైదు నెలలకు పైగా, ఇటా అటా అని ఊగిసలడుతున్న బీఆర్ఎస్ బహిష్కృత నాయకులు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి శ్రీనివాస రావు చివరకు హస్తంతో చేతులు కలిపేందుకు సిద్దమవడంతో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ఇంకొంత పెరిగింది. బండిని మార్చేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేసినా రాష్ట్రకార్యవర్గాన్ని విస్తరించినా, ఫలితం కనిపించడం లేదు. అయితే కర్ణాటక విజయంతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుందా? విభేదాలు తొలిగి పోయాయా? అంటే లేదనే సమాధానమే వస్తోంది. నిజానికి, కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కనిపిస్తున్న ప్రశాంతత తుపాను ముందు ప్రశాంతత మాత్రమే, అనే మాటలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ ను పెంచాయి కానీ అదే సమయంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల్లో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమేయం పెరగడం టీ పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు దివంగత కాంగ్రెస్ నాయకుడు వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల తమ పార్టీని ని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని వస్తున్న వార్తలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. నిజానికి కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీలో కనిపించిన ప్రశాంతతే ఇప్పడు కాంగ్రెస్ లో కనిపిస్తోందని అంటున్నారు.షర్మిల విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరం పార్టీలో ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. కాగా కర్ణాటక ఫలితాలు వెలువడిన వెంటంటే షర్మిల బెంగుళూరు వెళ్ళారు. డీకే శివకుమార్ ను కలిసి అభినందనలు తెలిపారు. అలాగే అది జరిగిన వారం పదిరోజుల వ్యవధిలో ఆమె మరో మారు బెంగుళూరు వెళ్లి డీకే శివకుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఇక అక్కడి నుంచి షర్మిల వైఎస్సార్ – టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారని టీపీసీసీ పగ్గాలు చేపట్టనున్నారనే ప్రచారం మొదలైంది. అయితే ఆమె ఆ వార్తలను ఖండిచారు. అయినా షర్మిల విషయంలో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం కొనసాగుతూనే వుంది. ఆమెను పార్టీలోకి ఆహ్వానించే విషయంలో అభిప్రాయ బేధాలు భగ్గుమంటున్నాయి.వైఎస్సార్ తో కలిసి పనిచేసిన సీనియర్ నాయకులు షర్మిలకు స్వాగతం పలుకుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే స్వాగతిస్తామని టీపీసీసీ మాజీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ప్రకటించారు. మరోవైపు డీకే శివకుమార్ ద్వారా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు షర్మిలను అస్త్రంగా ప్రయోగిస్తున్నారని రేవంత్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది.రేవంత్ రెడ్డి, తాజాగా తాను పీసీసీ అధ్యక్షునిగా ఉన్నంతవరకు తెలంగాణలో షర్మిల రాజకీయాలు సాగనీయనని తేల్చి చెప్పారు. ఒక విధంగా శపథమే చేశారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే ఆంధ్ర పాలన నుంచి విముక్తి కోసం. ఇప్పుడు రాష్ట విభజనకు వ్యతిరేకంగా పనిచేసిన ఆంధ్ర పాలకులను ఎలా పార్టీలో చేర్చుకుంటాం అని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి చెందిన షర్మిల వచ్చి తెలంగాణలో నాయకత్వం వహిస్తానంటే ఎలా ఊరుకుంటామంటూ నిప్పులు చెరిగారు. షర్మిల ఏపీ కాంగ్రెస్కి పని చేస్తే స్వాగతిస్తానంటూ హితవు పలికారు. షర్మిల ఏపీసీసీ చీఫ్గా పని చేస్తే.. సహచర పీసీసీ అధ్యక్షునిగా వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా కలుస్తానని చెప్పుకొచ్చారు. అంతే కానీ.. తెలంగాణలో ఆమె నాయకత్వంలో పనిచేసేది లేదని కుండబద్దలు కొట్టేశారు. తాను కాంగ్రెస్ లో ఉన్నంత వరకు షర్మిల నాయకత్వం తెలంగాణలో రానివ్వనని రేవంత్ రెడ్డి స్పష్తం చేశారు.అదలా ఉంటే రాహుల్ గాంధీ, ప్రధానంగా 2024 లోక్ సభ ఎన్నికలపై దృష్టిని కేద్రీకరించినందున, ఈ సవత్సరం చివర్లో తెలంగాణ సహా జరిగే ఐదు రాష్త్రాల అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంకా వాద్రా అప్పగించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె ఇప్పటికే మధ్య ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. త్వరలో తెలంగాణలోనూ ప్రియాంక పర్యటించనున్నారు. ముఖ్యంగా జూపల్లి, పొంగులేటి సహా మరికొందరు ముఖ్య నాయకుల చేరికలు ఆమె సమక్షంలో అదీ కూడా నల్గొండ వేదికగా జరగనున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఇంతకాలం సీనియర్ నాయకులపై పైచేయి, సాధిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డిపై ఇక సీనియర్ నాయకులు పైచేయి సాధించే అవకాశం లేక పోలేదని అంటునారు. అందుకే రేవంత్ రెడ్డి తాను పీసీసీ చీఫ్ గా ఉన్నంత వరకు షర్మిలను గాంధీ భవన్ మెట్లు ఎక్కనీయనని శపధం చేశారని అంటున్నారు.