YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అపచారం వల్లే అగ్ని ప్రమాదాలా...

అపచారం వల్లే అగ్ని ప్రమాదాలా...

తిరుపతి, జూన్ 17, 
తిరుపతి నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ షాపులో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఉవ్వెత్తున వ్యాపించి.. ఇళ్ల దిశగా వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దూరంగా పరుగెత్తారు. గోవిందరాజస్వామి ఆలయ రథానికి సమీపం వరకూ మంటలు వ్యాపించాయి. స్థానికులు కొంత మంది కలిసి రథాన్ని దూరంగా లాగడంతో ప్రమాదం తప్పింది. ఈలోగా అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పి వేశారు. 2 గంటలకు పైగా శ్రమించి మొత్తం 10 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.గోవిందరాజస్వామి ఆలయం పక్కన ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో ఫోటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో భవనం ముందు ఉన్న 5 బైక్‌లు దగ్ధమయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తిరుపతిలో అపచారం జరగడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక టీడీపీ నేతలు ఆరోపించారు. ఘాట్ రోడ్డులో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. తిరుమలలో జరుగుతున్న అపచారాలు, అన్యమత ప్రచారం లాంటి అపశ్రుతుల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ నాయకురాలు సుగుణమ్మ ఆరోపించారు. గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో రావిచెట్టు పడిపోతే.. ఆలయాన్ని సంప్రోక్షణ చేశారా అని ఆమె ప్రశ్నించారు. తిరుమల కొండపైకి అన్యమత ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్ ఉన్న వాహనం ఎలా వెళ్లిందని ఆమె ప్రశ్నించారు. గంగమ్మ జాతరలోనూ అపచారం జరిగిందని, తిరుపతిలో అపచారాల వల్లే తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సుగుణమ్మ అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం బ్రాహ్మణులతో అన్నీ చెప్పించుకొని, తిరుపతి నగరం మొత్తం శాంతి ప్రవచనాలు పలికించాలని ఆమె కోరారు. ఈ అగ్నిప్రమాదాన్ని టీడీపీ నేతలు రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై సమగ్ర విచారణ చేయిస్తున్నామని ఆయన తెలిపారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అధికారులతో కలిసి ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో గోవిందరాజస్వామి వారి రథానికి మంటలుు అంటుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కొంత మంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ఆయన హితవు పలికారు.

Related Posts