YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మరో వివాదంలో కేదార్ నాధ్ ఆలయం

మరో వివాదంలో కేదార్ నాధ్ ఆలయం

డెహ్రాడూన్, జూన్ 20, 
చార్‌ధామ్‌ యాత్రల్లో ఒకటైన పవిత్ర కేదార్‌నాథ్ ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గర్భ గుడిలో ఉన్న శివలింగంపై ఓ మహిళ.. డబ్బులు వెదజల్లడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ సమయంలో ఆలయ పూజారులు సైతం అక్కడే ఉండి వేద మంత్రాలు పఠించారు. వారు కూడా మహిళను అడ్డుకోకపోవడం తీవ్ర వివాదంగా మారింది. కేదార్‌నాథ్ ఆలయంలో పూజలు జరుగుతున్నాయి. ఆలయ పురోహితులు వేద మంత్రాలను పఠిస్తున్నారు. ఆ సమయంలో గర్భగుడిలోకి వెళ్లిన ఓ మహిళ.. శివలింగానికి పక్కనే నిలబడి ఉంది. అనంతరం అక్కడ ఉన్న కేదారీశ్వరుడిపై కరెన్సీ నోట్లను చల్లింది. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడ ఉన్న వారు ఫొటోలు, వీడియోలు తీశారు. ఇవి కాస్త బయటికి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అయితే ఆ మహిళ ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. కేదార్‌నాథ్‌ ఆలయ గర్భగుడిలో ఫొటోలు, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధం. అలాంటిది ఆమె లోపలికి వెళ్లి నోట్లను శివలింగంపై చల్లుతూ అనుచితంగా ప్రవర్తిస్తుంటే మహిళను ఎవరూ అడ్డుకోకపోవడంతో సోషల్ మీడియాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పవిత్రమైన కేదార్‌నాథ్ గర్భగుడిలో ఇదేం ప్రవర్తన అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు.. తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బంది, నిర్వహణ అధికారుల తీరుపై ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే బద్రీనాథ్‌ - కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్‌ స్పందించారు. రుద్ర ప్రయాగ్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన వారందరిపైనా కఠినంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.ఇది ఇలా ఉండగా..హిమగిరుల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయానికి సువర్ణ తాపడంలో గోల్‌మాల్ జరిగిందని సాక్షాత్తు ఆలయ సీనియర్‌ పూజారి సంతోష్‌ త్రివేది సంచలన ఆరోపణలు చేశారు. ఛార్-ధామ్ మహాపంచాయత్ వైస్-ప్రెసిడెంట్‌‌గా ఉన్న సంతోష్ త్రివేది..ఈ వ్యవహారంలో ఏకంగా రూ.125 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను బద్రీనాథ్‌ - కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ తోసిపుచ్చింది. రాజకీయ కుట్రలో భాగంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఖండించింది. గతేడాది మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో బంగార తాపడం చేయించారు.అయితే, ఇవి స్వర్ణ పలకలు కాదని, అంతా ఇత్తడేనని సీనియర్ పూజారి ఆరోపించడం గమనార్హం. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో సంతోష్‌ త్రివేది మాట్లాడుతూ.. కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడి లోపల గోడలను బంగారు రేకులతో కప్పుతున్నట్లు చెప్పి, ఇత్తడి పలకలు వాడారని అన్నారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతానని ఆయన హెచ్చరించారు. అంతేకాదు, ఆలయానికి స్వర్ణ తాపడం విషయంలో కమిటీలోని పలువురు వ్యతిరేకించారని, ఇది సంప్రదాయానికి విరుద్దమని అన్నారు. ఈ కుంభకోణాన్ని ప్రజల మనోభావాలపై దాడిగా ఆయన అభివర్ణించారు.అయితే, బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్‌ మాత్రం దీనిని తోసిపుచ్చారు. మోదీ నాయకత్వంలో కేదార్‌నాథ్‌ అభివృద్ధి పనులు అద్భుతంగా జరిగి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటం చూసి ఓర్వలేని వ్యక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారం ఇదని తోసిపుచ్చారు. కాగా, మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త కేదార్‌నాథ్ ఆలయానికి 230 కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు. ఈ బంగారంతోనే ఆలయానికి సువర్ణ తాపడం పనులు ప్రారంభించారు. ఆలయం లోపల రూ.14.38 కోట్ల విలువైన 23.7 కిలోల బంగారంతో తాపడం చేయించినట్టు తెలుస్తోంది.

Related Posts