ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో వెలికితీసే చమురు, సహజవాయు నిక్షేపాలపై చెల్లించాల్సిన రాయల్టీ బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 237.53 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన రాయల్టీ బకాయిలను ప్రతియేటా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో విడుదల చేస్తుండగా, ఈ ఏడాది మాత్రం మే నెలలోనే విడుదల చేయడం గమనార్హం. రాష్ట్రంలో ఓఎన్జీసీ సహా పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు చమురు, సహజవాయు నిక్షేపాలను వెలికి తీస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలు వెలికితీసే నిక్షేపాలపై రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు గత ఏడాది సెప్టెంబర్లో రూ. 286 కోట్లు కేంద్ర పెట్రోలియం శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది కాస్త ముందుగానే రాయల్టీ బకాయిలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.